The Spy Next Door: సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారారు
ABN , Publish Date - May 31 , 2025 | 12:45 PM
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోన్న అంశం.

ఇంటర్నెట్ డెస్క్ : యావత్ భారతావనిని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారాతున్నారనేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోన్న అంశం. పహల్గాం ఉగ్రవాద దాడి.. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ ప్రతీకార దాడుల నేపథ్యంలో భారత నిఘా సంస్థలు పాక్ ఎఎస్ఐ నెట్వర్క్ గురించి తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి. ఈ తరుణంలో గత నెలలో, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇంకా పంజాబ్లో కనీసం 15 మందిని ఆయా రాష్ట్రాల పోలీసులు వివిధ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకోవడం లేదా అరెస్టు చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఫేస్బుక్లో హనీ-ట్రాప్ చేయబడిన ముంబైలోని ఒక ఇంజనీర్ భారత యుద్ధనౌక బ్లూప్రింట్లను గీశాడు. హర్యానాలోని ట్రావెల్ వ్లాగర్ పాకిస్తాన్కు ఏడు సార్లు వెళ్లివచ్చింది. రాజస్థాన్లోని ఒక ప్రభుత్వ ఉద్యోగి పాక్ ఐఎస్ఐకి భారత సిమ్ కార్డ్లు సరఫరా చేయడం ద్వారా పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) బృందానికి సమాచారాన్ని అందిస్తున్నాడు. ఇవన్నీ.. పాకిస్తాన్కు భారతదేశ సున్నితమైన సమాచారాన్ని అందించడంలో ఐఎస్ఐ చేస్తున్న నెట్వర్క్ను, దాని లోతుల్ని చెప్పకనే చెబుతున్నాయి.
CRPF ఇన్సైడర్: మోతీ రామ్ జాట్
మోతీ రామ్ జాట్ అనే వ్యక్తి భారత ఉన్నత స్థాయి అధికారి కాదు. కానీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లోని కీలక సమాచారాన్ని అందించడం ద్వారా ఐఎస్ఐ నెట్ వర్క్లో భాగమయ్యాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)ప్రకారం, జాట్ 2023 నుండి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (PIOలు)తో సంప్రదింపులు జరిపాడు. డబ్బుకు అమ్ముడుపోయి భారత రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేశాడు. జాట్.. జూన్ 6 వరకు NIA కస్టడీలో కొనసాగుతున్నాడు. అతను ఇంకా ఎలాంటి సమాచారాన్ని చేరవేశాడనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
డాక్యార్డ్లో హనీట్రాప్: ఇంజనీర్ రవీంద్ర వర్మ
మహారాష్ట్రలో, ముంబైకి చెందిన రక్షణ సాంకేతిక సంస్థలో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీర్ 27 ఏళ్ల రవీంద్ర వర్మ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడ్డాడు. దీంతో అతన్ని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వర్మకు దక్షిణ ముంబైలోని నావల్ డాక్యార్డ్లోకి ప్రవేశం ఉంది . దీంతో భారత జలాంతర్గాములు, యుద్ధనౌకలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేశాడన్న ఆరోపణలపై ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. వర్మ తెలిసి కూడా పలు మార్లు భారతకు చెందిన గోప్య డేటాను ఐఎస్ఐ ప్రతినిధులతో పంచుకున్నాడన్న ఆరోపణలున్నాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ : జ్యోతి మల్హోత్రా
ప్రముఖ యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను మే నెలలో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు, ఆమెకు ISI కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని అధికారులతో, అలాగే పాకిస్తాన్ టూర్ల సమయంలో ప్రత్యక్షంగానూ, అనేక మార్లు సంబంధాలు కలిగి ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఆమె డానిష్, అహ్సాన్ ఇంకా షాహిద్ అనే పాకిస్తాన్ నిఘా అధికారులతో సంభాషించిందని తెలుస్తోంది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల ఫోరెన్సిక్ పరీక్షలో 12 టెరాబైట్లకు పైగా డేటా బయటపడింది. ఇందులో ఆమెకు పాక్ ISI తో ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి.
మల్టిపుల్ హెల్త్ వర్కర్: సహ్దేవ్ సింగ్ గోహిల్
భారత సైనిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేసినందుకు గుజరాత్కు చెందిన 28 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తను అరెస్టు చేశారు. ఇతను భారత్ కొత్తగా నిర్మించిన భారత వైమానిక దళం (IAF) సరిహద్దు భద్రతా దళం (BSF) స్థావరాలకి సంబంధించిన సమాచారాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో చేరవేసినట్టు ఆధారాలున్నాయి.
2023లో వాట్సాప్ ద్వారా తనను తాను అదితి భరద్వాజ్గా పరిచయం చేసుకున్న పాక్ ఐఎస్ఐకి చెందిన వ్యక్తితో గోహిల్ స్నేహం చేశాడు. గోహిల్ 2025లో తన ఆధార్ వివరాలతో కొత్త సిమ్ కార్డు తీసుకుని వన్-టైమ్-పాస్వర్డ్ (OTP) ద్వారా భరద్వాజ్ అనే మారుపేరున్న వాట్సాప్ ఖాతాను యాక్టివేట్ చేశాడు. దీని ద్వారా భారత సైనిక రహస్యాలను చేరవేశాడు. అందుకు గాను సదరు వ్యక్తి నుంచి రూ. 40,000 నగదు తీసుకున్నాడని ATS తెలిపింది.
హర్యానాలో అరెస్టులు
హర్యానాలో, ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకుని ISI తన గూఢచార నియామకాలు చేసినట్టు నిర్ధారణ అయింది. ఇందులో భాగంగా పాటియాలాకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి దేవేందర్ సింగ్ ధిల్లాన్ భారత ఆయుధాలకు సంబంధించిన చిత్రాలను ఐఎస్ఐకి పంపించాడు. ఇతను నవంబర్ 2024లో పాకిస్తాన్కు వెళ్లాడు.
మరో కేసులో.. 24 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అయిన నౌమాన్ ఇలాహిని పానిపట్లో భారత దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. అతను.. తన బావమరిది బ్యాంక్ ఖాతా ద్వారా లబ్ది పొంది ISIకి భారత రహస్య సమాచారాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. చేతులు మారిన సొమ్ముల వ్యవహారాన్ని భారత అధికారులు నిర్ధారించారు.
ఇక, హర్యానాలోని నుహ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల అర్మాన్, ఇంకా తారిఫ్ అనే ఇద్దర్నీ కొన్ని రోజుల వ్యవధిలో భారత దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశారు. తారిఫ్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు తన ఫోన్లోని పాకిస్తాన్ నంబర్లతో చేసిన చాట్లను డిలీట్ చేయడానికి ప్రయత్నించాడు.
బ్యూరోక్రటిక్ లింక్
జైసల్మేర్కు చెందిన రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్ను గూఢచర్యం ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఖాన్ (49), గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ మాజీ మంత్రి షాలే మొహమ్మద్కు వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశాడు. వీరిద్ధరూ దగ్గర దగ్గరగా ఉన్న గ్రామాలకు చెందిన వాళ్లే కావడం విశేషం. అంతేకాదు, మాజీ మంత్రి మొహమ్మద్ రెండుసార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు. పలు అనుమానాల నేపథ్యంలో ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. మరోవైపు, ఖాన్ ఏడు సార్లు పాకిస్తాన్కు వెళ్లాడు. అతని డిజిటల్ పాదముద్రలు, డిలీట్ చేసిన ఫైళ్లు, అనుమానాస్పద లావాదేవీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించి వాటిపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నాయి.
డిజిటల్ ఫ్రంట్: సిమ్ కార్డులు, యాప్లు
మరో ప్రత్యేకమైన కేసులో, రాజస్థాన్లోని డీగ్కు చెందిన 34 ఏళ్ల కాసిమ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఆగస్టు 2024, మార్చి 2025 మధ్య రెండుసార్లు పాకిస్తాన్కు ప్రయాణించి ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం, కాసిమ్ భారతీయ సిమ్లను పాక్కు అక్రమంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత ISI ఆపరేటివ్లు భారతీయులను సంప్రదించడానికి, సైనిక సమాచారాన్ని తెలుసుకోడానికి వీటిని ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పాక్ ఐఎస్ఐ గూఢచారుల అరెస్టులు ప్రారంభమైన తర్వాత భయంతో తన దగ్గరున్న సున్నితమైన డేటాలను తొలగించినట్లు కాసిమ్ అంగీకరించాడు. అయితే, పోలీసులు అతని ఫోన్లు, ల్యాప్ టాప్స్లపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుపుతున్నారు. అతని నెట్వర్క్ను తెలుసుకోడానికి కాల్ డేటా రికార్డులను సమీక్షిస్తున్నారు.
థానే లోనూ ఐఎస్ఐ ఏజెంట్లు
థానేలో జరిగిన మరో అరెస్టు ద్వారా ముంబైలోని ఒక వ్యక్తి గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిసింది. నవంబర్ 2024, మార్చి 2025 మధ్య భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చేరవేసినట్టు అతను కూడా అంగీకరించాడు.
వ్యాపారవేత్త, టెక్కీ గూఢచర్యం
ఉత్తరప్రదేశ్ రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మొరాదాబాద్లో అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్కు పలుమార్లు సందర్శించినప్పుడు షాజాద్.. పాక్ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిఘా సమాచారాన్ని పంచుకున్నాడని, వినియోగ వస్తువుల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని తెలుస్తోంది.
ఇక, జలంధర్లో, ISI ఆపరేటివ్లకు సున్నితమైన డేటాను పంపడానికి తాను అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించారనే ఆరోపణలపై మహ్మద్ ముర్తజా అలీని అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారులు అతని ఇంటి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి నేరాలకే సంబంధించి పంజాబ్కు చెందిన గజాలా , యామిన్ మొహమ్మద్ అనే మరో ఇద్దర్ని పోలీసులు, భారత నిఘా సంస్థలు విచారిస్తున్నాయి. వీరిద్దరూ విదేశీ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారని, భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు అనుమానాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతర నిరంతర నిఘా
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశ కౌంటర్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను పునర్నిర్మించారు. అప్పటి నుండి, సరిహద్దు రాష్ట్రాలు, కీలక రంగాలలో నిఘా ముమ్మరం చేశారు. రాజస్థాన్ పోలీసుల సమాచారం ప్రకారం, గత నెలలో ఒక్క జైసల్మేర్లోనే ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అటు, హర్యానాలోనూ దర్యాప్తు సంస్థలు కొన్ని అనుమానిత వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, వాళ్ల ట్రావెల్ డేటాను కూడా సమీక్షించడం మొదలుపెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News