US Deportation Flights: భారత్కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:54 AM
Indian Migrants: అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం భారత్కు రానుంది. అయితే అగ్రరాజ్యం నుంచి వచ్చే వలసదారుల విమానాలు పంజాబ్లోనే ల్యాండింగ్ అవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి ఆయన చాలా విషయాల్లో అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. సంకెళ్లు వేసి మరీ వాళ్లను స్వదేశానికి పంపిస్తున్నారాయన. వలసల విషయంలో మిత్రదేశం భారత్తోనూ ఆయన ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. యూఎస్లో అక్రమంగా నివసిస్తున్న 104 మందిని రీసెంట్గా సైనిక విమానంలో ఇండియాకు పంపారు. రెండో విడతగా ఇవాళ మరో 119 మంది ఇక్కడికి రానున్నారు.
ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?
అమెరికా నుంచి వస్తున్న సీ-17 మిలటరీ ఫ్లైట్ శనివారం రాత్రి 10.05 గంటలకు పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అవనుంది. ఇందులో అత్యధికులు పంజాబ్కు చెందినవారే కావడం గమనార్హం. 67 మంది పంజాబీలతో పాటు హరియాణాకు చెందిన 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందినవారు ఇద్దరు చొప్పున హిమాచల్ ప్రదేశ్, గోవా, జమ్మూ కశ్మీర్కు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున డిపోర్టేషన్ ఫ్లైట్లో ఉన్నారు. మొదట రెండు విమానాల్లో వలసదారులు రానున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఒకటి మాత్రమే వస్తోంది. రెండో దాని గురించి ప్రస్తుతానికి ఏ స్పష్టత లేదు.
పంజాబ్కే ఎందుకు?
అక్రమ వలసలపై తగ్గేదే లేదని అంటోంది అమెరికా. ప్రతివారం అక్రమ వలసదారులను వాళ్ల స్వదేశాలకు పంపే ప్రక్రియ కంటిన్యూ అవుతుందని యూఎస్ అధికారులు అంటున్నారు. వీరంతా డంకీ రూట్తో పాటు ఇతర మార్గాల ద్వారా అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించారని సమాచారం. కాగా, అక్రమ వలసదారుల విమానాలు అమృత్సర్లోనే ల్యాండ్ అవడంపై వివాదం చెలరేగుతోంది. పంజాబ్ ప్రతిష్ట దిగజార్చేందుకే కేంద్ర సర్కారు ఇలా చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. అహ్మదాబాద్లో ఎందుకు ల్యాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణల్ని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. యూఎస్ వెనక్కి పంపుతున్న వారంతా భారతీయులేనని.. అమృత్సర్లో ల్యాండ్ అవడం పెద్ద విషయం కాదని అంటున్నారు. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అక్రమ మార్గాల్లో వెళ్లడానికి ప్రజలు రిస్క్ చేయడానికి కారణం ఏంటో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
రైతన్నకు అండగా.. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్..
ప్రయాగ్రాజ్కి ప్రత్యేక వందే భారత్ రైలు..
కుంభమేళా వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి