Noida: ఇన్ స్టాలో లొల్లి.. గల్లీలోకి వచ్చి కారుతో యాక్సిడెంట్..
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:28 PM
Noida Road Rage Incident: సోషల్ మీడియాలో ఇద్దరు నెటిజన్ల మధ్య చెలరేగిన లొల్లి యాక్సిడెంట్కు దారితీసింది. దారుణంగా కామెంట్ చేశాడనే కారణంతో ఓ వ్యక్తి ప్లాన్ ప్రకారం సదరు నెటిజన్ను కారుతో గుద్దేసి పారిపోయాడు.

Instagram Fight Turns Violent: ఏ సోషల్ మీడియా ప్లాట్ఫాంలో అయినా చాలామంది నెటిజన్లు ఒకరికొకరు దారుణంగా తిట్టుకుంటూ ఉంటారు. సభ్య సమాజం తలదించుకునేలా బూతు పురాణాలు వల్లిస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఆ తిట్టుకునే వ్యక్తులకు కనీస ముఖపరిచయం కూడా ఉండదు. కేవలం తమ అభిమాన హీరో, క్రికెటర్, పొలిటీషన్, ఇలా కేవలం నచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన వాళ్లపై రెచ్చిపోతుంటారు. ఎంతలా అంటే కొన్నిసార్లు సదరు వ్యక్తికి చంపేస్తాం.. అంతుచూస్తాం.. అంటూ కామెంట్ సెక్షన్లో వార్నింగ్ ఇస్తుంటారు. అచ్చం ఇలానే ఇన్ స్టాలో ఇద్దరు నెటిజన్ల మధ్య ఓ అంశంపై గొడవ జరిగింది. దీన్ని అంతటితో వదిలేయకుండా ఓ వ్యక్తి పగతో రగిలిపోయాడు. ఇన్ స్టాలో మొదలైన ఈ లొల్లి కారుతో యాక్సిడెంట్ చేసే వరకూ దారితీయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా థార్ SUV ను వేగంగా నడుపుతూ వచ్చి రోడ్డుపై వెళ్తున్న యువకుడిని డ్రైవర్ ఢీకొట్టాడు. అతడు కారు పక్కనే ఉన్న మురుగు కాలువలోకి ఒక్కసారిగా ఎగిరిపడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆన్లైన్ గొడవ ఈ హింసాత్మక చర్యకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇద్దరు నెటిజన్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వారు ఒకరికొకరు సుపరిచితులే కావడం వల్ల ఓ వ్యక్తి కోపం పట్టలేక ఎలాగైనా కసి తీర్చుకోవాలని ఈ యాక్సిడెంట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో మొదలైన రచ్చ వీధిలో భౌతిక ఘర్షణకు దారితీసిందని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) సుమిత్ కుమార్ శుక్లా వెల్లడించారు. యువకుడిని కారు గుద్దేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పేర్కొన్నారు.
కారు ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రోడ్డుపై నుంచి అకస్మాత్తుగా కాలువలోకి ఎగిరిపడటంతో తీవ్రరక్తస్రావమై కదలలేని స్థితికి చేరుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, క్రిమినల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ADCP శుక్లా తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కారులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం..
Kamal Haasan: తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్పై కర్ణాటక హైకోర్టు ఫైర్..
For More AP News and Telugu News