Human Trafficking: మహిళల అక్రమ రవాణా కుట్ర భగ్నం.. 56 మందిని రక్షించిన పోలీసులు..
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:56 PM
అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్కు బయల్దేరిన న్యూ జల్పాయ్గురి-పట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్లో పెద్ద సంఖ్యలో యువతులు ఎక్కారు. వీరంతా ఒకే బోగీలో కూర్చున్నారు. టీసీ టికెట్ చెకింగ్ కోసం వచ్చిన సమయంలో ఎవరి వద్ద టికెట్లు లేవు. కొంతమంది ముభావంగా, ఆందోళనగా ఉండటంతో రైల్వే సిబ్బందికి సందేహం కలిగింది. ఇదే గాక, అందరి చేతులపై స్టాంప్లు ఉండటంతో అనుమానం మరింత బలపడింది. వెంటనే ఒకరిద్దరు యువతులను ఆరా తీయగా అందరం జాబ్ కోసం వెళ్తున్నాం.. అని చెప్పడంతో అసలు విషయం బోధపడింది.
బెంగళూరులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా అమ్మాయిలను మభ్యపెట్టింది. ఆ తర్వాత యువతులు అందరినీ ఒకచోట చేర్చారు. న్యూ జల్పాయ్గురి-పట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్లో అందరినీ ఒకే బోగీలో ఎక్కించారు. ఇంతవరకూ బాగానే ఉంది. టీటీ రాగానే అసలు కథ మొదలైంది. టిక్కెట్లు చూపించమంటే ఒకరి తర్వాత మరొకరు మా దగ్గర లేవంటే లేవన్నారు. కేవలం బోగీలో ఉన్న ఒక మహిళ, పురుషుడు మాత్రమే వీళ్ల తరపున టికెట్లు చూపించారు. పైగా అందరి చేతులపై కోచ్లు, బెర్త్ నెంబర్లు ముద్రించి ఉండటం అనుమానాస్పదంగా అనిపించింది.
అమ్మాయిలను ఆరా తీయగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానాలు ఇచ్చారు. కొంతమంది అందరం కలిసి బెంగళూరులో జాబ్ కోసం వెళ్తున్నాం అన్నారు. మరి, బిహార్ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత వీళ్ల తరపున టికెట్లు చూపించిన ఇద్దరినీ.. వీరిని బిహార్ ఎందుకు తీసుకెళ్తున్నారని అధికారులు అడిగారు. వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో, వెంటనే అధికారులు అప్రమత్తమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కు సమాచారమిచ్చారు.
రైల్వే పోలీసుల ప్రాథమిక విచారణలో అనుమానితులు అక్రమ రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం రైళ్లో తరలిస్తున్న 56 మంది అమ్మాయిలను వాళ్ల కుటుంబాలకు అప్పగించారు అధికారులు. యువతులంతా18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు గల వారే కావడం గమనార్హం. వీరంతా పశ్చిమ బెంగాల్ నివాసితులే. ఈ కేసులో మహిళ సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ.. సీఈసీ కీలక ప్రకటన
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో అల్లకల్లోలం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి