Nara Bhuvaneswari: మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:38 PM
మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు.

అమరావతి: కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యాఖ్యలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భువనేశ్వరి సంఘీభావం ప్రకటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరి స్పందించారు. మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతిరెడ్డికి తాను పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు నారా భువనేశ్వరి.
ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు. మహిళల పట్ల అవమానకరమైన పదాలు వారి విలువను తగ్గించలేవని అన్నారు. మహిళల స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవని తెలిపారు. మన సంస్కృతి, విలువలు ఆడవారిపై గౌరవాన్ని నిలబెట్టాయని చెప్పుకొచ్చారు. దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని నారా భువనేశ్వరి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జగన్ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే
స్లీపర్ సెల్స్పై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
For More AP News and Telugu News