AP Telangana BJP Chiefs: ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్లకు సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ విషెస్
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:49 PM
AP Telangana BJP Chiefs: ఏపీ, తెలంగాణలో బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మాధవ్, రామచందర్ రావుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు.

అమరావతి, జులై 1: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు (PVN Madhav) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని ఎక్స్లో సీఎం పోస్టు చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్లు మాధవ్, రామచందర్ రావులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఇద్దరు నేతలు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
చంద్రబాబు ట్వీట్
‘ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన బాధ్యతల్లో మీరు రాణించాలని కోరుకుంటున్నాను. కూటమిలోని మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడదాం’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
హృదయపూర్వక అభినందనలు: లోకేష్
‘ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ రామచందర్ రావుకు నా హృదయపూర్వక అభినందనలు. శాసనమండలి సభ్యులుగా పని చేసిన ఇద్దరూ చట్టసభల్లో తమగళాన్ని బలంగా వినిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలపై పోరాడిన అనుభవం గల ఇద్దరు నేతలు తెలుగుజాతి అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్టు చేశారు.
పవన్ అభినందనలు
అలాగే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్ రామచందర్ రావుకు హృదయపూర్వక అభినందనలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించిన ఆయన ఎమ్మెల్సీగా ప్రజా గళాన్ని శాసనమండలిలో వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేపడతారని, కేంద్ర ప్రభుత్వం జాతీయ దృక్పథంతో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాను అని డిప్యూటీ సీఎం అన్నారు.
అలాగే ఏపీ బీజేపీ చీఫ్గా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు పవన్. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్న మాధవ్.. శాసనమండలి సభ్యుడిగా పలు ప్రజా సమస్యలపై, యువత, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు చట్టసభల్లో ప్రస్తావించారన్నారు. జాతీయవాద దృక్పథం కలిగిన నాయకుడని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ కూటమి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజల కష్టసుఖాలను పంచుకున్న నారాయణ, వేమిరెడ్డి
సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో జగన్కు రిలీఫ్
Read Latest AP News And Telugu News