Venkaiah Naidu: ఆ వ్యాఖ్యలు సభ్యసమాజం సహించలేనివి: వెంకయ్యనాయుడు
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:28 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. . ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవని చెప్పారు.

అమరావతి: రాజధాని అమరావతి మహిళల మనోభావాలను తీవ్రంగా గాయపర్చేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు (Krishnam Raju) అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై అమరావతి రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ఆ వ్యాఖ్యలు హేయమైనవి
‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి. సభ్యసమాజం సహించలేనివి. కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ... భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..
హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన
For More AP News and Telugu News