TDP: పార్టీలు, ఎన్నికల విధానాల్లో మార్పులపై టీడీపీ కీలక సూచనలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 02:39 PM
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో మంగళవారం ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో ఈసీ అధికారులని టీడీపీ నేతలు కలిశారు.

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేసింది. ఈసీతో ఇవాళ(మంగళవారం, జులై 15) ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో ఈసీ అధికారులని టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ బృందంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, నేతలు కూన రవికుమార్, జ్యోత్స్న ఉన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖను టీడీపీ బృందం అందజేసింది. ఈవీఎంలపై ఓటర్ల జాబితా పరంగా టీడీపీ నేతలు కీలక సూచనలు చేశారు. సీజీఏ (CAG) ఆధ్వర్యంలో వార్షిక తృతీయ పక్ష ఆడిట్ నిర్వహించింది. పార్టీలు, ఎన్నికల విధానాల్లో మార్పులతో పాటు పలు అంశాలపై చర్చించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో అన్ని పార్టీల సూచనలు తీసుకుంటున్నామని ఈసీ తెలిపింది. బీహార్లో ఈసీ సంస్కరణలను టీడీపీ బృందం స్వాగతించింది. గంట సేపు కేంద్ర ఎన్నికల కమిషనర్లతో టీడీపీ నేతలు చర్చించారు. ఆగస్టు - జనవరి మధ్య ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగనుందని సీఈసీ తెలిపారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. అపోహలకు చోటులేకుండా సంస్కరణలు అమలుచేయాలని సూచించారు. ప్రత్యేక యాప్ ద్వారా ఓటరు జాబితా సవరణ చేయాలని శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
టీడీపీ చేసిన కీలక సూచనలు ఇవే..
ఏఐ ఆధారిత టూల్స్తో డూప్లికేట్, మరణించిన ఓటర్లని గుర్తించాలి.
EPIC నంబర్లలో డూప్లికేట్ల తొలగింపు, ఆధార్తో క్రాస్ వెరిఫికేషన్
సరికొత్త బయోమెట్రిక్ పద్ధతికి మార్పు సూచన.
బీఎల్ఏలకు (Booth Level Agents) చురుకైన పాత్ర కల్పించాలి.
బూత్ లెవెల్ ఏజెంట్లకు డ్రాఫ్ట్ రోల్స్ ముందుగానే ఇవ్వాలి.
అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు సమాన హక్కులు ఉండాలి.
పబ్లిక్ యాక్సెస్, పారదర్శకతకు బలమైన పిలుపు.
జిల్లా వారీగా డాటా విడుదల చేయాలి.
ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల వివరాలు.
ప్రజల ఫిర్యాదుల కోసం రియల్ టైం డ్యాష్బోర్డు ఏర్పాటు.
చట్టపరమైన సంస్కరణలు అవసరం.
బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ అధికారుల నిర్లక్ష్యానికి శిక్షలు విధించాలి.
రాష్ట్రస్థాయిలో ఆంబుడ్స్మెన్ నియామకం చేయాలి.
వలసదారులు, ఆదివాసీలు, వృద్ధుల చేర్పు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
మొబైల్ BLOలతో పున:నమోదు డ్రైవ్లు చేపట్టాలి.
తాత్కాలిక చిరునామాల ఆధారంగా ఓటింగ్ హక్కు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ తరపున టీడీపీ నేతలు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
2029 వరకు ఎన్నికలు లేకపోవడంతో త్వరలో SIR (Special Intensive Revision) ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ముందు కనీసం 6 నెలల ముందు SIR పూర్తి చేయాలని అభ్యర్థించారు.
SIR పౌరసత్వ ధ్రువీకరణ కాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బలోపేతానికి ఇచ్చిన సూచనలని ఆ పార్టీ నేతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్లో దారుణం
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
Read latest AP News And Telugu News