AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:13 AM
ఏపీ కేబినెట్ భేటీ బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రిమండలితో చర్చించనున్నారు.

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) సచివాలయంలో ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు జరుగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోదించనున్నారు. హెచ్వోడీ 4 టవర్ల టెండర్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. 9 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై మాట్లాడనున్నారు. అమరావతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలపనున్నారు. 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంపెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. తల్లికి వందనంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగాడేపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈనెల 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయోబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఓకే చెప్పనుంది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన జీవోకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనపై నిర్ణయం తీసుకోనుంది. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ముఖ్యమంత్రి షెడ్యూల్ వివరాలిలా..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. 10.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ఏపీ సచివాలయానికి వెళ్తారు. 11.00 గంటలకు కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 02.00 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. 03.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో పీ4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎంను కలిసిన అక్కినేని నాగార్జున
గంజాయి, డ్రగ్స్ వ్యాపారుల గౌరవాధ్యక్షుడు జగన్: నక్కా
For Andhrapradesh News And Telugu news