విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి
ABN , Publish Date - Jul 21 , 2025 | 10:02 AM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి జులై 21న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు..

విజయవాడ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి మూడు రోజుల క్రితం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. సోమవారం (జులై 21, 2025) ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే, అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ అధికారులకు సమాచారం అందజేశారు.
వాస్తవానికి సోమవారం మాజీ మంత్రి నారాయణస్వామి సిట్ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఆయన విచారణకు రానని సిట్ అధికారులకు సమాచారమిచ్చారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన పాత్ర ఏమీ లేదని దర్యాప్తులో తేలడమే కారణం. అందుకే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా స్టేట్ మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి కె.నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది.
లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ కుంభకోణంలో 49 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి(A1) ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (A4)ని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో పలువురు కీలక నిందితులపై విచారణ కొనసాగుతోంది. నూతన మద్యం పాలసీ పేరుతో గత జగన్ ప్రభుత్వం సుమారు రూ.3500 కోట్ల వరకూ కొల్లగొట్టినట్లు సిట్ అంచనా వేస్తోంది. ప్రతి నెలా రాజ్ కసిరెడ్డి రూ.50-60 కోట్ల వరకూ వసూలు ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డి (A5), జగన్ సతీమణి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి (A33) అందజేసేవాడని వెల్లడించింది. మొత్తంగా ఈ కేసులో జగన్ మోహన్రెడ్డి అంతిమ లబ్దిదారుగా ఉన్నాడని సిట్ ఆదివారం విడుదల చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొంది. త్వరలోనే సిట్ ఈ కేసుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు కోర్టుకు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మల్లిక స్పైన్ సెంటర్కు బెస్ట్ పేపర్ అవార్డ్
అభివృద్ధి పేరుతో పొలాలు లాక్కోవద్దు
For More AndhraPradesh News And Telugu News