CM Chandrababu: ఆ విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:45 PM
CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని అన్నారు.

రాజమండ్రి, జులై 1: పేదలను ఆదుకునేలా 'పేదల సేవలో' కార్యక్రమం చేపట్టామని.. ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వటం వల్ల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పెన్షన్లు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీలో జరిగిన విధ్వంసాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. నూటికి 13 మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని అన్నారు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. ‘అభివృద్ధి చేస్తాం.. సంపద సృష్టిస్తాం.. ఆదాయం పెంచుతామని’ వెల్లడించారు. పెరిగిన ఆదాయం పేదలకు పంచి అభివృద్ధికి ఖర్చు పెడతామని చెప్పుకొచ్చారు. తన తల్లి పడిన కష్టం ఏ మహిళకూ ఉండకూడదని ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నామని వివరించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పింఛన్లు ఇచ్చేటప్పుడు ఉద్యోగులు సేవా భావంతో ఉండాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో పేదవారిని చులకనగా చూస్తే సహించనని హెచ్చరించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కష్టపడుతున్నానని తెలిపారు. మానవత్వంతో దివ్యాంగుల కోసం 12 రెట్లు పింఛన్లు పెంచామన్నారు. రాజకీయ ముసుగు వేసుకొని ప్రజాధనాన్ని దోచుకుంటే సహించనని వార్నింగ్ ఇచ్చారు. ఎన్డీయే కార్యకర్తలు దగ్గరుండి మరీ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పరిశీలించాలని ఆదేశించారు. ‘డ్రగ్స్, గంజాయి విక్రయించే వారి తాట తీస్తా. ఆడబిడ్డపై చేయివేసే వారికి అదే చివరి రోజు. రౌడీయిజాన్ని సహించను’ అని తీవ్రంగా హెచ్చరించారు సీఎం.
నెలలోపు డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ‘సాధారణ కుటుంబంలో పుట్టి దేవుని కృప వల్ల అంచెలంచెలుగా అభివృద్ధి చెందాం. డాక్టర్ అంబేడ్కర్ సాధారణ కుటుంబం నుంచి జన్మించి తరతరాలు గుర్తుండే రాజ్యాంగాన్ని రచించారు. లక్ష బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నాం. రూ.10లక్షల కోట్ల అప్పులు తీర్చాలని’ అన్నారు. పోలవరాన్ని వైసీపీ భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని 2027కి పూర్తి చేసే అదృష్టం దేవుడు తనకే ఇచ్చారన్నారు. డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. గోదావరి పుష్కరాలు మూడోసారి తానే చేయబోతున్నానని.. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి రౌడీలు వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పాయకరావుపేట హాస్టల్లో సరిగ్గా భోజనం పెట్టని ఉద్యోగులను సస్పెండ్ చేశామన్నారు. వివేకా మృతిపై ఆయన కుమార్తె అనుమానం వ్యక్తం చేస్తే గొడ్డలి పోటుగా నిర్ధారించామని అన్నారు. రౌడీషీటర్ను పలకరించటానికి జగన్ వెళ్లి రౌడీయిజం చేశారని ఫైర్ అయ్యారు. జగన్ కారు కిందపడి చనిపోతే కుక్కను లాగినట్టు పక్కన లాగి పాడేశారన్నారు. ‘నా జీవితంలో నేను ఎక్కడా ఎవర్ని కొట్టలేదు, నాపై కేసులు లేవు. ప్రజలను కాపాడేందుకు నేరస్తులతో రాజకీయ పోరాటం చేస్తున్నా. నేరస్తులకు ఓటు వేసి గెలిపిస్తారా’ అని సీఎం ప్రశ్నించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నాటికి నూరు శాతం సేవలు అందిస్తామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది తలసరి ఆదాయం రూ.30వేలు పెంచామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో జగన్కు రిలీఫ్
సీఎం హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News