Kishan Reddy: అందెశ్రీ పాటలు లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించాయి: కిషన్రెడ్డి
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:28 PM
అందెశ్రీ మృతిని తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. అనేక విషయాలను ముక్కుసూటిగా చెప్పే గొప్ప వ్యక్తిత్వం అందెశ్రీదని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) మరణం సాహితీ లోకానికి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీతో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని గుర్తుచేశారు. తనతో పాటు పోరుయాత్రలో చాలా సభల్లో ఆయన పాల్గొనేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు తమ ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించామని గుర్తుచేశారు. అలాగే అందెశ్రీ తనకు సలహాలు కూడా ఇచ్చేవారని పేర్కొన్నారు కిషన్రెడ్డి.
ఇవాళ(సోమవారం) అందెశ్రీ నివాసానికి కిషన్రెడ్డి వెళ్లి ఆయన పార్థీవదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందెశ్రీతో తనకు ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు, జయ జయహే తెలంగాణ’ వంటి అద్భుతమైన పాటలను తెలంగాణ ఉద్యమ సమయంలో రాశారని పేర్కొన్నారు. ఆయన పాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించారని తెలిపారు కిషన్రెడ్డి.
అందెశ్రీ మృతిని తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. అనేక విషయాలను ముక్కుసూటిగా చెప్పే గొప్ప వ్యక్తిత్వం అందెశ్రీదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై పరిశోధన చేసి పుస్తకం రాయాలనే సంకల్పంతో ఆయన అనేక పరిశోధనలు చేశారని వివరించారు. దురదృష్టవశాత్తూ ఆ పుస్తకం పూర్తి కాకుండానే వారు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే అందెశ్రీకి ఎంతో అభిమానం ఉందని తెలిపారు. చాలా పేదరికం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆయన వచ్చారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. సమాజంలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం కలిగించాలని ప్రతి క్షణం అందెశ్రీ ఆలోచించేవారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్రావు ఫైర్
Read Latest Telangana News and National News