TG News: తెలంగాణలో పేలుడు కలకలం.... ఇద్దరికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:34 AM
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్లో శుక్రవారం పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్లో పడటంతో ఈ ఘటన జరిగింది.

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్లో (Attapur Petrol Bunk) ఇవాళ( శుక్రవారం) పేలుడు సంభవించింది. మెట్రో పిల్లర్ నెంబర్-136 దగ్గర పెట్రోల్ బంక్లో ఈ పేలుడు చోటుచేసుకుంది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్లో పడటంతో ఈ ఘటన జరిగింది. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. క్షణాల్లోనే పేలుడు సంభవించి ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరూ వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. తక్షణమే స్థానికులు అంబులెన్స్కి సమాచారం అందించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరగడంతో స్థానికులను దూరంగా పంపించి వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సమయానికి ఫైర్ సిబ్బంది స్పందించకపోతే పెట్రోల్ స్టేషన్ పూర్తిగా దగ్ధమయ్యేదని, పక్కనున్న భవనాలకు మంటలు వ్యాపించి భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహారించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక
గుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలు
Read latest Telangana News And Telugu News