Share News

Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

ABN , Publish Date - Jun 05 , 2025 | 09:44 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ఈనెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్
Telangana Cabinet KEY Decisions

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ(గురువారం) కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ఈనెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అలాగే 300 పేజీల ఎన్డీఎస్ఏ రిపోర్ట్, 150 పేజీల విజిలెన్స్ రిపోర్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇచ్చారు. రిపోర్ట్‌పై మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారు.


పెండింగ్‌ బిల్లుల చెల్లింపుపై...

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి(TGIIC) బదిలీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలు చేయాలని మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్ శాఖలో 300 పోస్టుల క్రియేషన్‌కి ఆమోదించింది. ఉద్యోగుల డిమాండ్లపై సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్‌ చర్చించింది. అధికారుల కమిటీ నివేదికపై ఈ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, ఆరోగ్య భద్రతతో సహా..పెండింగ్‌ బిల్లుల అంశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఉద్యోగులకు ఒక డీఏ, ప్రతి నెల రూ.700కోట్లతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. రూ.23వేల కోట్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది.

CM-Revanth-reddy.jpg


కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆమోదం

జహీరాబాద్ ఇండస్ట్రీయల్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా సంఘాలకు బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు.


ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేరాఫ్‌గా కొత్తగూడెం నిలిచింది. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీతో తెలంగాణ ఖ్యాతి పెరుగనుంది. ఈ సందర్భగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.


రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి రేపు (శుక్రవారం) పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయనున్నారు. గంధమల రిజర్వాయర్‌కి , ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కి, యాదగిరిగుట్ట వేద పాఠశాలకి శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. తుర్కపల్లి పబ్లిక్ మీటింగ్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసగించనున్నారు.


317 జీవోపై కీలక నిర్ణయం: భట్టి విక్రమార్క

bhatti-vikramarka.jpg

ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒక డీఏ వెంటనే ఇస్తామని మాటిచ్చారు. మరో డీఏ ఆరు నెలల తర్వాత ఇవ్వాలని కేబినెట్‌లో తీర్మానం చేశామని చెప్పారు. హెల్త్ కార్డ్‌ల కోసం సీఎస్ చైర్మన్‌గా ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ప్రతినెల రూ. 700 కోట్లు చెల్లించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఉద్యోగుల 12.5 నియమాకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి సర్వీస్‌లోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీపీసీ రెగ్యులర్‌గా జరిపి ప్రమోషన్స్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన ఉద్యోగుల బదిలీలు రద్దు చేసి పాత స్థానాల్లోకి తీసుకువస్తామని ప్రకటించారు. అంగన్‌వాడీల రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ.2లక్షలకు పెంచామని తెలిపారు. 317 జీవో బాధితుల సమస్య పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


కేబినెట్‌కు మంత్రి సీతక్క ధన్యవాదాలు

seethakka-minister.jpg

ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వెనకబడ్డ జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు కేబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని వెల్లడించారు. ములుగు జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి, కేబినెట్ సహచరులందరికీ ములుగు జిల్లా ప్రజల పక్షాన మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 05 , 2025 | 10:36 PM