Eagle Team: డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:39 AM
ఈగల్ టీమ్ ఇటీవల నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అలాగే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్ న్యూ) పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ ముఠా అరెస్టు కేసులో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి.

ఇటీవల మూడు బడా కేసులు వెలుగులోకి..
కొద్దిరోజులుగా వారాంతపు నిఘాపై అధికారుల నిర్లక్ష్యం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఈగల్ టీమ్ (Eagle Team) ఇటీవల నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అలాగే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్ న్యూ) పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ ముఠా అరెస్టు కేసులో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి. డ్రగ్స్ స్మగ్లర్లు మాదకద్రవ్యాలను నిర్వాహకులకు సరఫరా చేసినట్లు తేటతెల్లమైంది. పబ్ కల్చర్కు అలవాటైన యువతను వలపు వలతో మత్తుకు బానిసలు చేస్తున్నారు. సంపన్నుల పిల్లలు, వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాధితులుగా ఉన్నారంటే నెట్వర్క్ ఎలా ఉందో అర్థమవుతోంది.
ఇటీవల గచ్చిబౌలిలో ఈగల్ (నార్కోక్ బ్యూరో) టీమ్ డెకాయ్ ఆపరేషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సంపన్నుల పిల్లలు, వైద్యులు ఉన్నారు. వారంతాల్లో పబ్లకు వెళ్లేవారే ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.
కొంపల్లిలోనూ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో సూర్యనెట్ వర్క్లో పబ్ నిర్వాహకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ, సైబరాబాద్ పరిధిలోని 10 పబ్లతో నిందితులకు డ్రగ్స్ లింకులు ఉన్నట్లు పబ్ల పేర్లతో సహా.. ఈగల్ సిబ్బంది ప్రకటించింది.
ఇటీవల ముంబయి డ్రగ్స్ స్మగ్లర్స్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్ న్యూ) పోలీసులు పట్టుకోగా డ్రగ్స్ వినియోగదారులు రవికుమార్ వర్మ, సచిన్లను విచారించిన అనంతరం ఈ ముఠాను పట్టుకున్నారు. డార్జిలింగ్కు చెందిన లేడీ డ్రగ్స్ స్మగ్లర్ చోడెన్ షేర్వా కతంగ్ డ్రగ్స్ను సరఫరా చేసినట్లు తేలింది. చోడెన్.. నగరంలోనే ఉంటూ తరచూ పబ్లకు వెళ్లి యువతపై వలపు వల వేసి పరిచయం పెంచుకొని ఆతర్వాత డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
పబ్లపై తగ్గిన ఫోకస్..
మాదక ద్రవ్యాలను పట్టించే స్నిఫర్ డాగ్స్తో శని, ఆదివారాల్లో పలు పబ్లలో, బార్ అండ్ రెస్టారెంట్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించేవారు. అక్కడికక్కడే డ్రగ్స్ కిట్స్లో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని అదుపులో తీసుకునేవారు. నగరంలోని పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటించారు. గత కొంతకాలంగా ఇటు పోలీసులు గానీ, అటు ఎక్సైజ్ అధికారులు గానీ పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిఘా పక్కన పెట్టారు. వారంతపు తనిఖీల పేరిట కొద్దిరోజులు హడావిడి చేశారు. ఇటీవల డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల మూడు బడా డ్రగ్స్ కేసుల్లో వినియోగదారుల నెట్వర్క్పై దృష్టి సారించిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
ఒడిశా బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
Read latest Telangana News And Telugu News