Rythu Bharosa: రైతన్నలూ.. డబ్బులు పడ్డాయ్.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి..
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:43 PM
రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: రైతు భరోసా (RYTHU BHAROSA) నిధులను రేవంత్ ప్రభుత్వం ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. రైతు నేస్తం వేదిక నుంచి ఆన్లైన్ మీట నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ఉద్ఘాటించారు సీఎం రేవంత్రెడ్డి.
రైతు భరోసా వేయగానే విస్తృత ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. 18 నెలల్లో రైతాంగం కోసం రూ.లక్ష కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
గత కేసీఆర్ ప్రభుత్వం దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వరి సాగు వేస్తే ఉరి వేసుకోవాల్సిందేనని మాజీ సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రైతు పండించిన చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు గెలవాలంటే రైతన్నల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాల్సిందేనని.. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా: మల్లు భట్టి విక్రమార్క
అన్నదాతల అందరి ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా డబ్బు మొత్తం జమ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తామని అన్నారు. రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పంట పరిహారం గురించి ఎందుకు పట్టించుకోలేదని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
నేటి నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నేటి నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా వేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎంత కష్టమైనా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని అన్నారు. దేశంలో నంబర్వన్గా తెలంగాణ రైతులను నిలిపే బాధ్యతను రేవంత్ సర్కార్ తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News