Share News

Heera Gold Nowhera Shaikh: హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు ఈడీ షాక్.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Nov 21 , 2025 | 08:47 PM

హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు.

Heera Gold Nowhera Shaikh:  హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు ఈడీ షాక్.. అసలు విషయమిదే..
Heera Gold Nowhera Shaikh

హైదరాబాద్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): హీరా గోల్డ్ నౌహీరా షేక్‌ (Heera Gold Nowhera Shaikh)కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.19 కోట్ల పై చిలుకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే హీరా గోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించారు. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రూ.5900 కోట్లు వసూలు చేసి నౌహీరా షేక్ బిచాన ఎత్తివేశారు. ఆమెపై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ వేలంలో నౌహీరా షేక్ ఆస్తి రూ.19.64 కోట్లను వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని మోసపోయిన బాధితులకు లేదా పెట్టుబడిదారులకు తిరిగి వినియోగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్‌ జోనల్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


కాగా, నౌహీరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది. ఆమెకు సంబంధించిన ఒక స్థిరాస్తిని రూ.19.64 కోట్లకు విజయవంతంగా వేలం వేశారు ఈడీ అధికారులు. నవంబరు 21, 2025న ఆ ఆస్తి రిజిస్ట్రేషన్‌ను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. ఈ ఆస్తిని ఈడీ 16.08.2019న తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్ ద్వారా స్వాధీనం చేసుకుంది. నౌహీరా షేక్ రూ.5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నౌహీరా షేక్, ఇతరులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో సహా పలు రాష్ట్రాల్లోని పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి.. అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA – 2002) కింద దర్యాప్తు చేపట్టింది. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. నౌహీరా షేక్, ఇతరులు ప్రజలను ఓ పథకం ప్రకారం నమ్మించి రూ. 5,978 కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించారు.


సంవత్సరానికి 36శాతం కంటే ఎక్కువ లాభం ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. కానీ బాధితులకు మూలధనం కూడా తిరిగి ఇవ్వకుండా భారీ మోసం చేశారు. రూ.428 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పటికే అటాచ్ చేసింది. నిందితురాలు నౌహీరా షేక్‌ను పోలీసులు విచారిస్తున్నారు. తన పేరుతో తన కంపెనీల పేర్లతో, బంధువుల పేర్లతో అనేక స్థిరాస్థులను నేరంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రూ.428 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ప్రధాన అభియోగ పత్రం, అదనపు అభియోగ పత్రం, ప్రత్యేక PMLA కోర్టుకు సమర్పించారు ఈడీ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేలంపాట వేశారు. ఇప్పటివరకు వేలం ద్వారా రూ.93.63 కోట్లు రాబడి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో కొనసాగుతున్న విచారణలో భాగంగా, బాధితులకు నష్టపరిహారం అందించేందుకు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయాలని ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం అనుమతి లభించడంతో MSTC ద్వారా పలు ఆస్తులను వేలం వేశారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును తిరిగి బాధితులకు చెల్లించాలని ఈడీ అధికారులు భావించారు.


వేలం ద్వారా ఇప్పటివరకు సాధించినవి:

ఇప్పటికే వసూలైన మొత్తం: రూ.25 కోట్లు

బిడ్డర్లు చెల్లించాల్సిన పెండింగ్ మొత్తం: రూ.68.63 కోట్లు

మొత్తం అంచనా వసూళ్లు: రూ.93.63 కోట్లు

ఇంకా అనేక ఆస్తులను త్వరలో వేలం వేయనున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు

బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ సిట్ దూకుడు.. విచారణకు హాజరైన హీరోయిన్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 09:07 PM