Pujara: ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:29 AM
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై భారత మాజీ బ్యాటర్ పుజారా స్పందించాడు. స్వదేశంలో టీమిండియా ఓడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత బ్యాటర్లు ఛేదించలేకపోయారు. హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలపై కూడా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా పరాజయంపై మాజీ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) స్పందించాడు. సొంత గడ్డపై భారత్ ఓడిపోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి దిగ్గజాల నిష్క్రమణతో ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉన్నప్పటికీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా స్వదేశంలో మ్యాచ్లు ఓడటం ఉపేక్షిందగ్గ విషయం కాదని అన్నాడు.
‘స్పల్ప లక్ష్యాన్ని టీమిండియా(Team India) ఛేదించలేకపోయింది. స్వదేశంలో భారత జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ప్రస్తుతం పరివర్తన దశలో ఉన్న మన జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో కూడా ఓడింది. అంత వరకు బానే ఉంది కానీ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నా స్వదేశంలో భారత్ ఓడిపోతుందంటే ఎక్కడో తప్పు జరుగుతోంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను స్పిన్తో వణికించి విజయం సాధించాలనుకున్న భారత్.. అదే ప్లాన్ వల్ల పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలించే విధంగా పిచ్ను తయారు చేసి ఉంటే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. భారత బ్యాటర్లు స్పిన్ పిచ్లపై మెరుగ్గా ఆడేందుకు కొత్త మార్గం కనుగొనాలి. ఫుట్వర్క్ ఉపయోగించి స్వీప్ షాట్లు ఆడాలి. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయాలి. ఇలాంటి టర్నింగ్ పిచ్లు కావాలనుకున్నప్పుడు బ్యాటింగ్ కోచ్ ఈ విషయం గురించి బ్యాటర్లతో మాట్లాడాలి. టర్నింగ్ పిచ్లకు తగ్గట్టుగా వ్యూహాలు రచించి అమలు చేయాలి’ అని పుజారా వివరించాడు.
ఇవి కూడా చదవండి:
గిల్ డిశ్చార్జ్.. నెక్ట్స్ ఏంటి?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి