Ind Vs Pak: క్యాచ్ ఔట్పై వివాదం
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:28 AM
ఏసీసీ టోర్నీలో ఇండియా-ఏ జట్టుపై పాకిస్తాన్-ఏ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ దగ్గర క్యాచ్ పట్టినా అంపైర్ నాటౌట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ(ACC)లో ఇండియా-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతార్ రాజధాని దోహాలోని వెస్ట్ ఎండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు పాక్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది.
అసలు ఏమైందంటే..
పాకిస్తాన్ ప్లేయర్ సదాఖత్(Sadakhat) కొట్టిన బంతిని బౌండరీ దగ్గర నేహాల్ వధేరా(Nehal Wadhera) అందుకుని, గాల్లోకి విసిరి రోప్ దాటాడు. మరో ఫీల్డర్ నమన్ క్యాచ్ పూర్తి చేశాడు. ఔట్ అని భావించిన సదాఖత్ కూడా మైదానాన్ని వీడాడు. అయితే రోప్నకు టచ్ కాకపోయినా అంపైర్లు నాటౌట్గా ప్రకటించారు. దీంతో భారత ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. మైదానాన్ని వీడిన సదాఖత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. బాల్ డెడ్ అయ్యే లోపు ఫీల్డర్ రోప్ లోపల ఉండాలని ఇటీవల ఐసీసీ రూల్స్ మార్చిన సంగతి తెలిసిందే. దీని వల్లే నాటౌట్గా ప్రకటించారని తెలుస్తోంది.
సెమీ ఫైనల్స్లోకి..
టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా 136 పరుగులకే ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ(45), నమన్ ధీర్(35) మినహా మిగతా బ్యాటర్లంతా నిరాశ పర్చారు. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్-ఏ.. 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్(79*) అద్భుత ప్రదర్శన చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ విజయంతో పాక్ జట్టు సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.
ఇవి కూడా చదవండి:
గిల్ డిశ్చార్జ్.. నెక్ట్స్ ఏంటి?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి