Murder Case: అందుకోసం మర్డర్ చేశాడు సరే.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడు..
ABN , Publish Date - May 14 , 2025 | 08:20 PM
Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.

Son Murdered Father Karnataka: అతడు ఓ ఐస్ క్రీం ఫ్యాక్టరీ యజమాని. జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ, హఠాత్తుగా ఓ రోజు షాపులో శవమై కనిపించాడు. మొదట్లో ఇది సాధారణ మరణమే అని అంతా అనుకున్నారు. ఎందుకో కుటుంబ సభ్యులకు అనుమానమొచ్చి పోలీసు స్టేషన్ గడప తొక్కారు. అంతే.. దర్యాప్తులో ఊహించని రీతిలో నిజాలు ఒకటొకటిగా బయటికొచ్చాయి. కర్ణాటకలోని కునిగల పట్టణంలో జరిగిన ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వ్యాపారవేత్తను డిగ్రీ కుర్రాడు హత్య చేసిన విధానం, కథ అల్లిన తీరు తెలిశాక అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
షార్ట్ సర్క్యూట్ వల్ల అని నమ్మించి..
తిమ్మసంద్రకు చెందిన నగేశ్ చాలా సంవత్సరాలుగా కునిగల్లోని శివాజీ టెంట్ రోడ్డులో నివసిస్తున్నాడు. అతడు అదే రోడ్డులో సొంతంగా అపోలో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని తెరిచాడు. అయితే, మే 11న ఐస్ క్రీమ్ తయారీ యూనిట్లో నగేశ్ అకస్మాత్తుగా జీవం లేకుండా కనిపించాడు. షార్ట్ సర్క్యూట్ వల్ల విద్యుత్ షాక్ తగిలి మరణించాడని అంతా అనుకున్నారు. అయితే, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నగేశ్ కుమారుడు సూర్యనే స్నేహితుడితో కలిసి కన్న తండ్రినే హత్య చేశాడని తేలింది. ఫ్యాక్టరీలోని సీసీటీవీని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడింది.
ఎందుకు చంపాడంటే..
చాలా సంవత్సరాల క్రితం నగేశ్ తన మెుదటి భార్యను విడిచిపెట్టాడు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుని స్వస్థలాన్ని వదిలి కునిగల్లో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతడి రెండో భార్యకు ఇద్దరు పిల్లలు. నగేశ్ ఒక రోజున కూతురుని పాఠశాలకు తీసుకెళ్తూ పెద్ద భార్య కుమారుడు సూర్యకి కనిపించాడు. అంతే, తండ్రిని చూడగానే సూర్య కోపం కట్టలు తెంచుకుంది. తర్వాత మే 10న స్నేహితులతో కలిసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్లి తండ్రితో గొడవపడ్డాడు. మాటల యుద్ధం కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో సూర్య తన తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, హత్య జరిగిన రోజున నగేశ్ (55) తన కొడుకును చెంపదెబ్బ కొట్టాడు. తర్వాత కర్ర తీసుకుంటుండగా సూర్య ఆపడానికి ప్రయత్నించాడు. అనంతరం తండ్రి మెడకు తెల్లటి గుడ్డ చుట్టి బలంగా గొంతు నులిమి చంపేశాడు. స్నేహితుడితో కలిసి నగేశ్ మృతదేహాన్ని మంచంపైకి చేర్చాడు. కరెంట్ షాక్ వల్ల చనిపోయాడని అందరూ అనుకోవాలని నగేశ్ చేతివేళ్లు స్విచ్బోర్డ్కు తాకేలా ఉంచడం సీసీటీవీలో స్పష్టంగా రికార్డు అయ్యింది. ప్రస్తుతం సూర్య (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన కునిగల్ పోలీసులు సూర్యను అరెస్టు చేశారు. అతడికి సహాయం చేసిన స్నేహితుడు పరారీలో ఉన్నాడు. విచారణలో నగేశ్ తన కుమార్తెను లైంగికంగా వేధించాడనే కారణంతోనే తాము హత్య చేశామని నిందితులు చెప్పారని తెలిసింది. అయితే హత్యకు ఆస్తి సమస్యలు, ఇతర కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అసలు నిజమేంటో ఇంకా తేలాల్సి ఉంది.
Read Also: Amit Shah: కర్రెగుట్టలో చారిత్రక విజయం: అమిత్షా..
Colonel Sofiya Qureshi: కల్నల్ ఖురేషిపై వ్యాఖ్యలు.. మంత్రికి హైకోర్టు షాక్
Bhuvanewar: భారత ఓడరేవులో కలకలం.. నౌకలో 21 మంది పాకిస్థానీలు.. అధికారుల హై అలర్ట్..