Bhavani Deeksha: ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
ABN , Publish Date - Dec 11 , 2025 | 08:38 AM
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్ష విరమణలు గురువారం నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానంపాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు ప్రారంభమయ్యాయి.
విజయవాడ, డిసెంబరు11 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో (Vijayawada Indrakiladri Kanakadurga Malleswara Swamy Temple) భవాని దీక్ష విరమణలు (Bhavani Deeksha Viramana) ఈరోజు(గురువారం) నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. ఇంద్రకీలాద్రిలో 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.హోమ గుండాలను దుర్గ గుడి ఈవో, చైర్మన్, ఆలయ స్థానాచారి వెలిగించారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో మార్మోగుతోంది ఇంద్రకీలాద్రి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రాగాంధీ మీడియాతో మాట్లాడారు.
భవానిల దీక్ష విరమణ సందర్భంగా.. ఇరుముడిని సమర్పించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఏడాది భవానీల సంఖ్య పెరుగుతోందని వివరించారు. ఇరుముడలను సమర్పించడానికి మూడు హోమగుండాలను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. 41 రోజులపాటు నియమ నిబంధనలు పాటిస్తూ భవానీలు మాలధారణ చేశారని తెలిపారు. భవాని భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్, 19 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఏపీ నలుమూలల నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. లక్షలాదిగా తరలివచ్చే భవానీలకు తాగునీరు, ప్రసాదం కొరత లేకుండా అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. 950 మంది క్షురకులు 4,000 మంది పోలీసు సిబ్బంది, 370కు పైగా సీసీ కెమెరాలతో భద్రతను పటిష్ఠం చేశామని పేర్కొన్నారు. అన్ని అర్జిత సేవలు డిసెంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిలిపివేశామని తెలిపారు.
గిరి ప్రదక్షిణ మార్గంపై వివరాలను అందించే భవానీ దీక్ష 2025 మొబైల్ యాప్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. భక్తులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని అన్నారు. సామాన్య భక్తుడికి పెద్దపీఠం వేశామని .. భవానీల కోసం ఉచిత క్యూలైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Read Latest AP News And Telugu News