Kadapa Municipal Corporation: కడప కార్పొరేషన్ సమావేశం.. మాధవీరెడ్డి కుర్చీపై ఉత్కంఠ
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:37 AM
Kadapa Municipal Corporation: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు మోహరించారు.

కడప, జూన్ 20: నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రికత్త కొనసాగుతోంది. మరోసారి కుర్చీల వివాదం తెరపైకి వచ్చింది. సమావేశ మందిరంలో మేయర్ కుర్చీ పక్కన ఎక్స్ అఫీసియో హోదాలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కమిషన్ కుర్చీలను ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హాజరయ్యారు. సర్వసభ్య సమావేశం జరిగే కౌన్సిల్ హాల్లోకి రాకుండా తన చాంబర్లోనే మేయర్ సురేష్ బాబు, వైసీపీ సభ్యులు ఉన్నారు. మేయర్ సురేష్ బాబు, వైసీపీ పాలకవర్గ సభ్యులు ఒక హాల్లో.. ఎమ్మెల్యే మాధవరెడ్డి సమావేశం హాల్లో ఉన్నారు. ఈ క్రమంలో వేరువేరుగా కూర్చోవడంతో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభంకాని పరిస్థితి.
ఈ సందర్భంగా నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. తన ప్రమేయం లేకుండా కమీషనర్ మీటింగ్ హాల్లో సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సమావేశం పలానా చోట నిర్వ హించాలని ఎక్కడా లేదని.. ప్రాంగణంలో నిర్వహిస్తామని కమిషనర్కు నోటీసులు పంపామని తెలిపారు. కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్మించాలని, అందుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కమిషనర్, ఉద్యోగులు.. ఎమ్మెల్యే తోత్తులుగా వ్యవహరిస్తున్నారని మేయర్ సురేష్ బాబు ఆరోపించారు.
మరోవైపు.. నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈరోజు (శుక్రవారం) కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరుగనుండటంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐ, 53 ఏఎస్ఐ, 110 కానిస్టేబుల్, 4 స్పెషల్ పార్టీ బృందాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్పొరేటర్లు తప్ప ఇతరులు ఎవరికీ కూడా లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
కాగా.. గత ఆరు నెలలుగా మేయర్ సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్దంగా మేయర్ కుటుంబం చేసిన కాంట్రాక్టు పనులపై వివాదం చెలరేగింది. మేయర్పై మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో హైకోర్టుకు వెళ్లిన మేయర్.. అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, సర్వసభ్య సమావేశం జరగాలని కోరారు. దీంతో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మేయర్ ఈరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎక్స్ అఫీసియో హోదాలో సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి రానున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మాధవీ రెడ్డి కుర్చీపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ.. నిలిచిన విమానం
భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం
Read Latest AP News And Telugu News