AP Govt: పల్నాడు జిల్లాలో జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - May 24 , 2025 | 09:09 PM
Palnadu District Case: మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రెండు జంట హత్యలు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. టీడీపీ వర్గీయులను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో (Macherla Constituency) ఇవాళ (శనివారం) రెండు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లను దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారుతో వెంబడించారు. ఆ తర్వాత బైక్ను బలంగా ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. ఆ ఇద్దరిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రాజకీయ కారణాలతోనే ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరిని కోల్పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రశోకంలో మునిగిపోయాయి. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీతో ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. హత్యకు జరిగిన కారణాలు, ఈ ఘటన పూర్వాపరాలను ఎస్పీని అడిగి మంత్రి గొట్టిపాటి తెలుసుకున్నారు. వెంటనే హోంమంత్రి అనితతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం ప్రకటించారు. టీడీపీ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్లో ప్రశంసల వర్షం
Tirumala: చంద్రబాబు వచ్చిన తర్వాత తిరుమలలో గత 11 నెలల్లో అనేక మార్పులు..
Read latest AP News And Telugu News