AP News: తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత హల్చల్
ABN , Publish Date - May 25 , 2025 | 10:01 PM
Leopard IN Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం సృష్టిచింది. చిరుత కదలికలతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ అధికారులు భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు.

తిరుమల: అలిపిరి (Alipiri) కాలిబాట మార్గంలో ఇవాళ (ఆదివారం) రాత్రి సమయంలో చిరుత (Leopard) హల్చల్ చేసింది. కాలిబాట మార్గంలోని 350వ మెట్టు సమీపంలో భక్తులకు చిరుత కనిపించింది. చిరుతను చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు. సమీపంలోని భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా భద్రతా సిబ్బంది పంపిస్తున్నారు. ఓ సెక్యూరిటీ గార్డ్తో పాటు మెగాఫోన్ పంపించి గోవింద నామాలు జపిస్తూ భక్తులు కొండపైకి వెళ్తున్నారు. మెగా ఫోన్ ద్వారా వచ్చే అధిక శబ్దానికి చిరుత భయపడి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు (TTD) భక్తుల భద్రతను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని, 12 ఏళ్లలోపు చిన్నారులను ఈ మార్గంలో అనుమతించకూడదని సూచించారు. ఇటీవల కాలంలో అలిపిరి మార్గంలో చిరుతల సంచారం పెరిగింది. చిన్నారులపై చిరుత దాడిచేసిన ఘటనలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ ద్వారా చిరుత సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News