Share News

AP Raj Bhavan : ఘనంగా ‘ఎట్‌ హోం’

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:19 AM

‘ఎట్‌ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏర్పాటు చేశారు.

AP Raj Bhavan : ఘనంగా ‘ఎట్‌ హోం’

  • హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, హైకోర్టు సీజే

రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సంపూర్ణ పేదరిక నిర్మూలన సాధించడం ద్వారా ఏ కుటుంబమూ ఆకలితో నిద్రపోకుండా, గౌరవప్రదంగా జీవించడమే లక్ష్యంగా పనిచేస్తాం.

- గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, గుడియా దంపతులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి.. ఉపముఖ్యమంత్రితో కలిసి.. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఎట్‌ హోం వేదిక వద్దకు తీడ్కొని వచ్చారు. గవర్నర్‌ అతిథులందరి వద్దకూ వెళ్లి పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించారు. ఆయన, చంద్రబాబు, పవన్‌ కాసేపు ముచ్చటించుకున్నారు. లోకేశ్‌ మిగిలిన అతిథుల మాదిరిగానే రౌండ్‌ టేబుల్‌ వద్ద కూర్చున్నారు. ఇది చూసిన వెంటనే ప్రొటోకాల్‌ అధికారులు ఆయన్ను వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఓ గంట తర్వాత జాతీయ గీతాలాపనతోనే కార్యక్రమం ముగిసింది.


మండలి డిప్యూటీ చైర్మన్‌ జకీయా ఖానమ్‌, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, ఎస్‌.సవిత, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, సీఎస్‌ కె.విజయానంద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు, జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికార, ప్రతిపక్ష నాయకులను, న్యాయమూర్తులను, అధికారులను ‘ఎట్‌ హోం’కు ఆహ్వానించడం ఆనవాయితీ. ఆదివారం ‘ఎట్‌ హోం’కు సీపీఐ నేత కె.రామకృష్ణ రాగా.. వైసీపీ నుంచి ఒక్కరు కూడా హాజరుకాలేదు. కాంగ్రెస్‌ నుంచీ ఎవరూ రాలేదు.

Updated Date - Jan 27 , 2025 | 04:20 AM