Share News

YCP Liquor Corruption: లిక్కర్‌ సొమ్ము విదేశాలకు

ABN , Publish Date - Jun 08 , 2025 | 02:42 AM

జగన్‌ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయపడుతున్నాయి. కమీషన్ల సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కొంత ఖర్చు చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలిన సంగతి తెలిసిందే.

YCP Liquor Corruption: లిక్కర్‌ సొమ్ము విదేశాలకు

  • షెల్‌ కంపెనీల ద్వారా భారీగా మళ్లింపు

  • ముంబై కేంద్రంగా నడిచిన వ్యవహారం

  • కీలక రూటింగ్‌ గుర్తించిన సీఐడీ బృందం

  • గోవిందప్ప బినామీ బ్యాంక్‌ ఖాతా నుంచి

  • షెల్‌ కంపెనీలకు మళ్లింపు

  • బ్యాంకుల కేంద్ర కార్యాలయాల్లో గుర్తింపు

  • ఐదు దశలు దాటి ఆరో దశలో విదేశాలకు

  • ముంబైలో డీఐజీ నేతృత్వంలో విచారణ

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో సిట్‌ అధికారులు అత్యంత కీలక సమాచారం సేకరించారు. దోచుకున్న వేల కోట్లలో పెద్ద మొత్తం షెల్‌ కంపెనీలకు మళ్లించినట్టు గుర్తించారు. వాటి ద్వారా విదేశాలకు పంపినట్టు తాజాగా విచారణలో తేలింది. ఈ తతంగమంతా ముంబై కేంద్రంగా జరిగినట్టు కనుగొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి కీలక రూటింగ్‌ గుర్తించారు.

అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయపడుతున్నాయి. కమీషన్ల సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కొంత ఖర్చు చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలిన సంగతి తెలిసిందే. ముడుపుల సొమ్ములో పెద్ద మొత్తం షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు చేరవేసినట్టు తాజాగా గుర్తించారు. డీఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో వారం రోజుల క్రితం ముంబైకి వెళ్లిన పది మంది అధికారుల బృందం షెల్‌ కంపెనీలకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని గుర్తించింది. హైదరాబాద్‌లో మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన నగదు ముంబైకు ఎలా చేరింది? అక్కడి నుంచి బంగారం కొన్నదెంత? అంతిమంగా షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించిన సొమ్ము ఎంత? ఆ సొమ్ము ఎన్ని దశలు దాటి ఎక్కడ నిల్వ అయిందనే సమాచారాన్ని కనుగొన్నట్లు తెలిసింది. వీటికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. లిక్కర్‌ స్కామ్‌లో ఎందరో సూత్రధారులు, పాత్రధారులు ఇప్పటికే వెలుగులోకి వచ్చారు. అయితే అంతిమ లబ్ధిదారు ఎవరో తెలిసినా ఆయనకు డబ్బులు చేరినట్లు ఆధారాలు సేకరించడంలో సిట్‌ అధికారులు ఎంతో ప్రయాస పడ్డారు.


సుమారు 200 మందిని విచారించి కీలక నిందితుల్ని అరెస్టు చేశారు. మద్యం వ్యాపారాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఏర్పాటైన సిండికేట్‌లో కీలక సభ్యుడైన బాలాజీ గోవిందప్ప, రాజ్‌ కసిరెడ్డి ముఖ్య అనుచరుడు చాణక్య ఇచ్చిన సమాచారం, వారి బ్యాంకు లావాదేవీల ఆధారంగా ముంబైలో పెద్ద వ్యవహారమే నడిచినట్లు పసిగట్టారు. రాజ్‌ కసిరెడ్డి ఆఫీసు, ఇంట్లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ద్వారా తేల్చిన గుట్టు, బాలాజీ గోవిందప్ప మైసూరులో బినామీ పేరుతో తెరిచిన బ్యాంక్‌ అకౌంట్‌, ముడుపులు వసూలు చేసిన ఏ6 చాణక్య విచారణలో వెల్లడించిన అంశాలను క్రోడీకరించి పోలీస్‌ బాస్‌కు వివరించారు. సిట్‌ అధికారులు ఇచ్చిన ఈ కీలక సమాచారం ఆధారంగా.. ఐదు రోజుల క్రితం సీఐడీ డీఐజీ ఫక్కీరప్ప కాగినెళ్లి నేతృత్వంలో పది మంది అధికారుల బృందాన్ని ముంబైకి పంపారు. అక్కడ పలు బ్యాంకుల కేంద్ర కార్యాలయాలకు వెళ్లి షెల్‌ కంపెనీల లావాదేవీలను పరిశీలించింది. రెండు షెల్‌ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాల్లో బాలాజీ గోవిందప్ప బాగోతం బయటికొచ్చింది. స్వతహాగా ఆడిటర్‌ అయిన గోవిందప్ప చాలా సంవత్సరాలుగా లెక్కల గోల్‌మాల్‌లో ఆరితేరినట్లు తెలుసుకున్న దర్యాప్తు బృందం అక్కడి ఆడిటర్లతో పాటు ఆదాయపు పన్ను అధికారుల సహకారం తీసుకుంది. పలు షెల్‌ కంపెనీల ద్వారా భారీ మొత్తం దేశం దాటి వెళ్లినట్లు కీలక ఆధారాలు సేకరించింది. మొత్తం ఐదు దశల్లో.. అంటే ఏ నుంచి బీకి.. బీ నుంచి సీకి.. ఇలా ఐదు కంపెనీలు దాటిన తర్వాత ఆరో షెల్‌ కంపెనీ ఎఫ్‌ నుంచి దేశం దాటినట్లు తేలింది. మరో నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి మరింత కీలక సమాచారాన్ని తీసుకు వస్తామని సీఐడీ బృందం పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. అత్యంత కీలకమైన ఆ ఆధారాలతో రాష్ట్రంలో రాజకీయ సంచలనాలకు దారి తీసే చర్యలకు పోలీసులు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మాన్షన్‌ హౌస్‌.. బంగారు బాతు

ముంబైలో ‘మాన్షన్‌ హౌస్‌’ యాజమాన్యం ఇచ్చిన ముడుపులు బంగారు బాతు గుడ్లేనని దర్యాప్తు సంస్థ నిర్ధారణకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ లిక్కర్‌ బ్రాండ్‌కు ఎక్కువ సేల్స్‌ ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ బ్రాండ్‌ మద్యాన్ని ఏపీలో సరఫరా చేసే ఎంఎస్‌ బయోటెక్‌ కంపెనీ యజమాని జయపాల్‌ రెడ్డిపై లిక్కర్‌ మాఫియా కమీషన్ల కోసం ఒత్తిడి తెచ్చింది. ఆయన స్పందించక పోవడంతో ఆ బ్రాండ్‌ లిక్కర్‌ ఆర్డర్లను ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్లాక్‌ చేయించారు. చివరకు ఆయన దారికి రావడంతో బేసిక్‌ ధరలో 20 శాతం ముడుపులు ప్రతి వారం చెల్లించాల్సిందిగా రహస్య ఒప్పందం చేసుకున్నారు. జయపాల్‌ రెడ్డి సిబ్బంది శ్రీనాథ్‌, ప్రవీణ్‌ ద్వారా మద్యం మాఫియా ముఠాకు చెందిన చాణక్య, ప్రకాశ్‌కు చేరింది. అయితే నగదు కాకుండా బంగారం రూపంలో ఇవ్వాలని అడగడంతో ముంబైలో పేరున్న బంగారం షాపులకు ముడుపుల డబ్బులు మళ్లించి బంగారం బిస్కెట్లు తీసుకున్నారు. భారతీ సిమెంట్స్‌లో శాశ్వత డైరెక్టర్‌ అయిన బాలాజీ గోవిందప్ప ఒక కీలక మహిళకు అత్యంత నమ్మకస్తుడు. నగదు తీసుకున్నా దాచుకోవడం కష్టమని.. బంగారం అయితే ఏటా విలువ పెరుగుతుందని ఆయన చేసిన సూచనతోనే ఈ బాగోతం నడిచినట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. జగన్‌ హయాంలో 1400 కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా చేసిన మాన్షన్‌ హౌస్‌ 20 శాతం కమీషన్‌ అంటే... 280 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం గనినే అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ గని బయట పడితే అంతిమ లబ్ధిదారు అసలు రూపం ప్రజలకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.


సొమ్ము షెల్‌ కంపెనీలకు..

లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ అధికారులు సుమారు 196.5 కోట్ల రూపాయల బంగారం షాపుల లావాదేవీలు గుర్తించారు. అందులో పద్మావతి జ్యుయలరీ షాప్‌కు 107 కోట్లు, తాయాల్‌ ఎంటర్‌ ప్రైజె్‌సకు 85 కోట్లు, సోనా చాంది జ్యుయలర్స్‌కు 3.5 కోట్లు, ఉదయ్‌ జ్యుయలరీ ఇండస్ట్రీ్‌సకు సుమారు కోటి రూపాయల వరకు చెల్లించి బంగారం కొన్నట్టు తేల్చారు. రాజ్‌ కసిరెడ్డి ముఖ్య అనుచరుడైన చాణక్య వ్యవహారాలు నడిపినట్టు అధికారులు గుర్తించారు. తాజాగా డీఐజీ నేతృత్వంలోని బృందం మరింత లోతుగా కూపీ లాగి మనీలాండరింగ్‌ వ్యవహారాలు, షెల్‌ కంపెనీల లావాదేవీలు పసిగట్టినట్లు సమాచారం. ఇందులో డికార్డ్‌ లాజిస్టిక్స్‌ యజమాని ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరుతో ఏర్పాటైన టెక్కర్‌ ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ద్వారా డొల్ల కంపెనీలకు ముడుపులు చేరినట్లు ఆధారాలు లభించాయి. శాన్‌హోర్డ్‌ ల్యాబ్స్‌ 30 కోట్లు, ఎస్‌పీవై ఆగ్రోస్‌ 15.6 కోట్లు, శాంజ్‌ ఫీడ్‌ టెక్నాలజీస్‌ 6.4 కోట్లు షెల్‌ కంపెనీలకు మళ్లించాయి. వాటితో పాటు టెక్కర్‌, అర్రామ్‌, ఈజీలోడ్‌ అనే డొల్ల కంపెనీలు కూడా లావాదేవీలు జరిపినట్లు తేలింది.

గోవిందప్ప మామూలోడు కాదు

స్కామ్‌లో ప్రారంభ దశ నుంచి అంతిమ లబ్ధిదారుకు ముడుపులు చేర్చే దాకా బాలాజీ గోవిందప్ప పాత్రపై దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది. మూడున్నర వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడైన రాజ్‌ కసిరెడ్డి(ఏ1)తో తరచూ కీలక విషయాలు చర్చించినట్లు గుర్తించింది. కసిరెడ్డి కార్యాలయానికి వచ్చి మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల డబ్బులు కారులో తీసుకెళ్లేవారని, అలా తీసుకెళ్లిన కోట్లాది రూపాయలు షెల్‌ కంపెనీల్లోకి మళ్లించి కర్ణాటకలో స్థిరాస్తి వ్యాపారాలతో పాటు ఇతరత్రా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించినట్లు సమాచారం. కమీషన్లు వసూలు చేసి అసలైన లబ్ధిదారుకు ఇవ్వడమే కాకుండా ఆయన కూడా వ్యక్తిగతంగా భారీ లబ్ధి పొందినట్లు పసిగట్టారు. 2012లోనే జగన్‌ అక్రమాస్తుల కేసులో గోవిందప్పను సీబీఐ విచారించి ఉంటే అప్పట్లోనే ఆయన లీలలు వెలుగులోకి వచ్చేవని అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది.

Updated Date - Jun 08 , 2025 | 02:46 AM