CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jul 14 , 2025 | 07:56 AM
అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తా పడి తొమ్మిది మంది కూలీలు మృతిచెందగా.. 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై నిన్న(ఆదివారం) అర్ధరాత్రి లారీ బోల్తా పడి తొమ్మిది మంది కూలీలు మృతిచెందగా.. 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి తొమ్మది మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.
ఈ ప్రమాదంలో తొమ్మది మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఆ ఘటన తీవ్రంగా కలచివేసింది: మంత్రి నారా లోకేష్
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై నిన్న(ఆదివారం) అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వేకోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో కూలీలు మృతిచెందడం బాధాకరమని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: హోంమంత్రి అనిత
అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద నిన్న(ఆదివారం) అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెడ్డిచెరువు కట్టపై మామిడికాయల లారీ బోల్తా పడి 9 మంది మృతి, 10 మందికి గాయాలయ్యాయని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి
For More AP News and Telugu News