Share News

తెలంగాణ బయో ఇంధన రంగంలో నవశకం

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:34 PM

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగానే కాకుండా, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలోనూ దేశానికే దిక్సూచిగా మారుతోంది. 2026 ఏప్రిల్ 12వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట పారిశ్రామిక ప్రాంతంలో జునో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టం.

తెలంగాణ బయో ఇంధన రంగంలో నవశకం
CBG project Telangana

ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్12 (ఆంధ్రజ్యోతి): భారతదేశపు స్వచ్ఛ ఇంధన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణలో ఒక భారీ అడుగు పడింది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట పారిశ్రామిక ప్రాంతంలో జునో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్రాజెక్టుకు ఈరోజు భూమిపూజ నిర్వహించారు.

ముఖ్య అతిథులు, ప్రముఖుల హాజరు..

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖులు హాజరై ప్రాజెక్ట్ విశిష్టతను చాటిచెప్పారు. ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి, తెలంగాణ ప్రభుత్వం దుద్దిళ్ల శ్రీధర్ బాబు , రాజ్యసభ సభ్యులు, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భువనేశ్వర్ కలిత.

లోక్‌సభ సభ్యులు ఎన్. కె. ప్రేమచంద్రన్

మాజీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సంతోష్ బగ్రోడియా

మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు

మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు

వీరితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కె. శశాంక (IAS), జె. నిఖిల్ చక్రవర్తి (IAS), ఆర్‌ఈసీ మాజీ సీఎండీ పీవీ. రమేశ్ (IAS Retd.), పీఎంఓ మాజీ ఓఎస్‌డీ ఎస్. వి. పిళ్ళై, గెయిల్ (GAIL), భాగ్యనగర్ గ్యాస్ (BGL) ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్: మూడు దశల్లో అభివృద్ధి

ఈ క్లస్టర్ ఆధారిత ప్రాజెక్ట్ మొత్తం 10 ప్లాంట్ల కలయికతో రూపొందించారు. వీటిని దశలవారీగా పూర్తి చేసేందుకు జునో జూల్ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించించారు.

మొదటి దశ: 3 ప్లాంట్లు సామర్థ్యం 30 TPD

పెట్టుబడి రూ. 210 కోట్లతో భూమిపూజ

రెండవ దశ: 3 ప్లాంట్లు సామర్థ్యం: 30 TPD పెట్టుబడి: రూ. 210 కోట్లు

మూడవ దశ: 4 ప్లాంట్లు సామర్థ్యం: 40 TPD పెట్టుబడి: రూ. 280 కోట్లు

మొత్తం:10 ప్లాంట్లు సామర్థ్యం:100 TPD పెట్టుబడి: రూ. 700 కోట్లు (2029-30 నాటికి పూర్తి


సాంకేతికత, ముడిసరుకు వివరాలిలా..

ఈ ప్లాంట్లు పూర్తిగా 'సర్క్యులర్ ఎకానమీ' సూత్రంపై పనిచేస్తాయి.

ఫీడ్‌స్టాక్: వరి గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలు, కోళ్ల వ్యర్థాలు, పశువుల పేడను ఇంధనంగా మారుస్తారు. జునో జూల్ సీబీజీ ప్లాంట్లు వరి గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలతో పాటు కోళ్ల వ్యర్థాలు, పశువుల పేడ వంటి సేంద్రీయ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మారుస్తాయి. దీనివల్ల పొలాల్లో గడ్డి తగులబెట్టడం వంటి పర్యావరణ సమస్యలు తగ్గడమే కాకుండా, వ్యర్థాల నుంచి విలువైన శక్తిని సృష్టించే 'సర్క్యులర్ ఎకానమీ' వృద్ధి చెందుతుంది. హానికరమైన గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడంతో పాటు, 'స్టబుల్ బర్నింగ్' (గడ్డి తగులబెట్టడం) సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

అనుసంధానం: ఇది 'ఆత్మనిర్భర్ భారత్', 'గోబర్ధన్' (GOBARdhan) కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, కేంద్ర ప్రభుత్వ CBG–CGD సింక్రొనైజేషన్ పథకం కింద, ఉత్పత్తి అయిన గ్యాస్‌ను నేరుగా సిటీ గ్యాస్ గ్రిడ్‌లోకి సరఫరా చేస్తారు.


గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మరిన్ని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తామని, సిద్దిపేట ప్రాంతాన్ని బయో ఎనర్జీ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం స్థిరమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గ పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్ట్ స్వచ్ఛ ఇంధనం, గ్రామీణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, రైతులకు, స్థానిక ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. భారతదేశ ఇంధన భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం వహించే దిశగా మా క్లస్టర్ ఆధారిత విధానం రూపొందించినట్లు వెల్లడించారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి విలువను సృష్టించడం ద్వారా స్వయం సమృద్ధి గల స్వచ్ఛ ఇంధన భారతాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పర్యావరణ ప్రయోజనాలతో పాటు, ఈ ప్రాజెక్ట్ స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ రైతు ఆదాయాన్ని పెంపొందించడంలో తోడ్పడుతుందని చెప్పారు. నర్మెట్టలో ప్రారంభమైన ఈ ప్రయాణం, దేశవ్యాప్తంగా సమీకృత బయో ఎనర్జీ మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఒక నమూనాగా నిలవనుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంలో ఈ క్లస్టర్ మోడల్ రూపొందించాం: సీఈఓ రాయపాటి నాగశరత్

భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంలో భాగంగా ఈ క్లస్టర్ మోడల్‌ను రూపొందించామని జునో జూల్ సీఈఓ రాయపాటి నాగశరత్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం గ్యాస్ ఉత్పత్తి మాత్రమే కాదని, వేలమంది రైతులకు అదనపు ఆదాయాన్ని, స్థానికులకు ఉపాధిని ఇచ్చే పారిశ్రామిక విప్లవమని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్ గెయిల్ (GAIL), భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) లతో ముందస్తు కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకుందని తెలిపారు. తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రవాణా, పారిశ్రామిక అవసరాలకు ఈ గ్యాస్ సరఫరా చేయబడుతుందని తెలిపారు. తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆచరణాత్మక పరిష్కారాలు అవసరమని భువనేశ్వర్ కలిత చెప్పారు. ఇవి దేశీయ వనరుల ద్వారా ఇంధన భద్రతను మెరుగుపరుస్తాయని రాయపాటి నాగశరత్ పేర్కొన్నారు.


జునో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాముఖ్యం..

జునో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో భారీ స్థాయి బయో ఎనర్జీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. సేంద్రీయ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ సుస్థిరత, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కంపెనీ కృషి చేస్తోంది. కంపెనీ భారతదేశంలో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల కల్పనలో నిమగ్నమై ఉంది. గోబర్ధన్, సతత్ (SATAT) వంటి జాతీయ పథకాలకు అనుగుణంగా స్వచ్ఛమైన, చౌకైన ఇంధనాన్ని అందించడమే కంపెనీ ధ్యేయం.


ఈ వార్తలు కూడా చదవండి...

పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై పీకో టెక్నాలజీ ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు

పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 03:28 PM