Share News

Miss World 2025: ప్రపంచ సుందరి థాయ్‌ సిరి

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:55 AM

ప్రపంచ సుందరి వేదికపై థాయ్‌ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్‌ సుందరి ‘ఓపల్‌ సుచాత షుంగ్‌సిరి’ని మిస్‌ వరల్డ్‌ కిరీటం వరించింది.

Miss World 2025: ప్రపంచ సుందరి థాయ్‌ సిరి

మన వెంబడి ఒకరున్నారన్న ధైర్యమే.. నిజమైన విజయం. బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నంటి ఉన్నట్టుగానే.. సమస్యల్లో ఉన్నవారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తా. మన చుట్టుపక్కల ఉన్నవారితో దయాగుణంతో వ్యవహరించడమే ఈ ప్రపంచంలో అత్యుత్తమైన పనిగా విశ్వసిస్తా.

- సుచాత షుంగ్‌సిరి

సుచాత షుంగ్‌సిరిని వరించిన కిరీటం

  • దయాగుణమే అత్యుత్తమం అన్న జవాబుతో విజయం

  • 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్‌ బారిన.. చికిత్సతో విముక్తి

  • అప్పటినుంచి ఆ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు

  • థాయ్‌లాండ్‌కు తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటం

  • రన్నర్‌పలుగా ఇథియోపియా, పోలాండ్‌, మార్టెనిక్‌ సుందరీమణులు.. టాప్‌-20లో నందినీ గుప్తా

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి వేదికపై థాయ్‌ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్‌ సుందరి ‘ఓపల్‌ సుచాత షుంగ్‌సిరి’ని మిస్‌ వరల్డ్‌ కిరీటం వరించింది. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్‌ బారినపడి కోలుకున్న ఆమె చేపట్టిన ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ ప్రాజెక్టు.. ‘బ్యూటీ విత్‌ పర్ప్‌స’కు నిదర్శనంగా నిలిచి ఆమెను ప్రపంచ సుందరిని చేసింది.థాయిలాండ్‌కు మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. సుచాత తలపై గత మిస్‌వరల్డ్‌ క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్‌ వరల్డ్‌ తొలి రన్నర్‌పగా ఇథియోపియా సుందరి హస్సెట్‌ దెరెజ్‌, రెండో రన్నర్‌పగా పోలాండ్‌ భామ మజా క్లాజ్డా, మూడో రన్నర్‌పగా మార్టెనిక్‌ సుందరి ఆర్లీ జోకిమ్‌ నిలిచారు. మిస్‌ వరల్డ్‌ పోటీల చివరి అంకమైన గ్రాండ్‌ ఫినాలేలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ అడిగిన ప్రశ్నకు సుచాత ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. ‘మిస్‌ వరల్డ్‌ ప్రయాణంలో వాస్తవాలు, వ్యక్తిగత బాధ్యత గురించి మీరు నేర్చుకున్నదేమిటి?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మన వెన్నంటి ఒకరున్నారన్నఽ దైర్యమే నిజమైన విజయం. బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నంటి ఉన్నట్టుగానే.. సమస్యల్లో ఉన్నవారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తా. మన చుట్టుపక్కల ఉన్నవారితో దయాగుణంతో వ్యవహరించడమే ఈ ప్రపంచంలో అత్యుత్తమైన పనిగా విశ్వసిస్తా..’’ అని సుచాత సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఆమెకు 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించింది. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో 2003లో సుచాత జన్మించారు. ఆమె 16 ఏళ్ల వయస్సులోనే రొమ్ము క్యాన్సర్‌ బారినపడి చికిత్స తీసుకున్నారు. అప్పటినుంచే ఆమె ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ పేరుతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది ఆమెను ప్రపంచ సుందరి పోటీల్లో ఇతరులకు భిన్నంగా నిలిపింది.

2.jpg


టాప్‌-20లో నిలిచిన నందినీ గుప్తా..

ఈసారి భారత సుందరి నందినీ గుప్తాకు మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కుతుందని ఎదురుచూసిన అభిమానులకు ఆమె మధ్యలోనే వెనుదిరగడం నిరాశ మిగిలింది. ఆసియా-ఓషియానా ఖండం విభాగంలో తొలుత టాప్‌-10లో, తర్వాత టాప్‌-5లోనూ నిలిచిన నందినీ గుప్తా.. ఆ తర్వాత విభాగాల వారీగా టాప్‌-2ను ఎంపిక చేసిన సమయంలో.. చోటు దక్కించుకోలేకపోయారు. ఆసియో-ఓషియానా విభాగంలో ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ భామలు టాప్‌-2లో నిలిచారు. చివరగా ఒక్కో విభాగం నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేసిన ఫైనల్‌ పోటీలో ఆసియా-ఓషియానా విభాగం నుంచి ఓపల్‌ సుచాత చోటు దక్కించుకున్నారు. చివరి రౌండ్‌లో ఆకట్టుకునే సమాధానం చెప్పి మిస్‌వరల్డ్‌గా నిలిచారు. ఆమెకు రూ.8.5 కోట్ల (మిలియన్‌ డాలర్లు) నగదు పురస్కారంతోపాటు వజ్రాల కిరీటాన్ని నజరానాగా ఇచ్చారు.


జడ్జిల ప్రశ్నలకు సుందరీమణులు చెప్పినదేమంటే..

మానుషి చిల్లర్‌ (మిస్‌ వరల్డ్‌ 2017): తప్పుడు సమాచారంతో

నిండిన ప్రపంచంలో, మీలాంటి యువ నాయకులు సత్యం, గౌరవం, కృతజ్ఞతతో ఎలా వ్యవహరించగలరు?

మిస్‌ మార్టినిక్‌: భవిష్యత్‌ నాయకులుగా మన దగ్గర ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రత్యేకంగా కొంత సమయాన్ని వెచ్చించాలని భావిస్తున్నాను. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో, ఇతర సమాచారంలో వాస్తవాలేవో మనకు తెలియదు. ఏఐ యుగంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి మనం కాస్త సమయాన్ని వెచ్చించి, ప్రతి సమాచారాన్ని అర్థం చేసుకోవాలి. మన హృదయం చెప్పేది నమ్మాలి.


రానా దగ్గుబాటి (నటుడు):

మిస్‌ వరల్డ్‌పై మీ ఆలోచన ఏమిటి?

ఈ పోటీలను తప్పుగా పేర్కొనే విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు?

మిస్‌ ఇథియోపియా: మిస్‌ వరల్డ్‌ ఇథియోపియాగా నా దేశం నుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. చాలా మంది కేవలం అందాల పోటీగానే భావిస్తారు. కానీ అంతకంటే ఎక్కువ. నా వెనుక చాలా మంది పిల్లలు, తల్లులున్నారు. నేను ఇక్కడ నిలబడటం నుంచి వారు ఎంతో స్ఫూర్తి పొందుతారు. ఇంత దూరం వచ్చిన మొదటి ఇథియోపియన్‌ నేనే. ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఇక్కడ ఉండటం కేవలం నాకోసమే కాదు. నా దేశంలోని పిల్లలు, తల్లుల కోసం అని నమ్ముతున్నాను. సేవ అంతర్లీనంగా ఉన్న ఈ పోటీల ఉద్దేశం గురించి నా దేశానికి చెప్పడమే నాలక్ష్యం.


నమ్రతా శిరోద్కర్‌ (నటి): తెలంగాణలో మీ అనుభవం, ఇక్కడ మీకు నచ్చిన ఒక ప్రధాన అంశం ఏమిటి?

మిస్‌ పోలాండ్‌: నా మితిమీరిన బిడియాన్ని ఈ పోటీల్లో పాల్గొని అధిగమించడమే ఇప్పటివరకు నా గొప్ప విజయంగా భావిస్తున్నాను. నేను ఇకనుంచి మరింత ఎక్కువమంది గొప్ప వ్యక్తులను నిర్భయంగా కలుస్తాను.. వారి నుంచి ప్రేరణ పొందుతాను. తెలంగాణలో నాకు ఇష్టమైన అనుభవం.. ఇక్కడి ఆతిథ్యం. ఈ దేశం, ఈ రాష్ట్రం అందించిన ఆతిథ్యం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. పోలాండ్‌ నా మొదటి ఇల్లు, తెలంగాణ నా రెండో ఇల్లుగా అనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు చిరునవ్వుతో పలకరిస్తారు.. సంతోషంగా ఆతిథ్యమిస్తారు. ఈ అనుభవాలు చిరస్మరణీయమైనవి.


సోనూ సూద్‌ (నటుడు): మిస్‌ వరల్డ్‌ ప్రయాణం మీకు వ్యక్తిగత బాధ్యత గురించి ఏం నేర్పింది?

మిస్‌ థాయిలాండ్‌: మిస్‌ వరల్డ్‌ వేదికపై నిలవడం నాకు జీవితంలో లభించిన గొప్ప అవకాశం. పర్యాటకులకు ఎలా ఆతిథ్యమిస్తారో అన్న విషయాన్ని నేను ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకున్నా. మన వెన్నంటి ఒకరున్నారన్న ధైర్యం ఎంతో సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. బాల్యంలో తల్లిదండ్రులు తోడున్నట్టుగా జీవితంలోని ప్రతిదశలో ఎవరో ఒకరు మనకు తోడుగా నిలుస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ తోడు చాలా ముఖ్యం. సమస్యల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటానికి నేను ప్రాధాన్యత ఇస్తా. దయాగుణమే ప్రపంచంలో అత్యుత్తమమైనదని విశ్వసిస్తా. చుట్టుపక్కల వారితో దయతో వ్యవహరించడం కంటే గొప్పది ప్రపంచంలో మరొకటి ఉండదు.


రైజింగ్‌ తెలంగాణ సత్తా చాటాం

మిస్‌ వరల్డ్‌ విజేత, రన్నరప్‌, పోటీదార్లకు సీఎం రేవంత్‌ అభినందన

3.jpg

మిస్‌ వరల్డ్‌గా నిలిచిన ఓపల్‌ సుచాత, రన్నర్‌పలు, ఇతర పోటీదారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి అందాల పోటీల కోసం వచ్చినవారంతా కూడా విజేతలేనని.. వారు అందంతోపాటు తెలివితేటలు, సమాజం కోసం చేస్తున్న మానవీయ కృషిని ప్రపంచ వేదికపై ఘనంగా చాటారని ప్రశంసించారు. ప్రపంచ సుందరి పోటీలు అద్భుతంగా సాగాయని, ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్రను, మన విలువలను, ‘తెలంగాణ రైజింగ్‌’ సత్తాను ఘనంగా చాటిచెప్పామన్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు, వేడుకలకు హాజరైన వారంతా మన రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లేనని, వారు ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ నినాదాన్ని ప్రపంచం నలుమూలలకూ తీసుకెళ్తారని పేర్కొన్నారు.


సీఎం రేవంత్‌, చిరంజీవి పక్కపక్కనే..

3.jpg

పోటీల కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిరంజీవి.. ఇద్దరూ వారి కుటుంబాలతో కలిసి ఒకేచోట కూర్చున్నారు. వారిద్దరు పక్కపక్కన ఉన్న వీడియో అక్కడి స్ర్కీన్‌లపై కనిపించగానే చాలా మంది ఫొటోలు తీసుకున్నారు. పోటీల సందర్భంగా గతేడాది మిస్‌వరల్డ్‌ క్రిస్టినా ప్రిజ్కోవా ర్యాంప్‌పైకి వస్తున్న సమయంలో చిరంజీవి తన ఫోన్‌లో ఆమె ఫొటో తీసుకున్నారు.


నాటు నాటుతో.. హోరెత్తిన ప్రాంగణం

మిస్‌ వరల్డ్‌ ముగింపు పోటీల సందర్భంగా బాలీవుడ్‌ నటులు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, ఇషాన్‌ కట్టర్‌ పలు పాటలకు డ్యాన్స్‌లు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు పాటకు’ కట్టర్‌ స్టెప్పులు వేశారు. ఆ సమయంలో పోటీల ప్రాంగణమంతా ప్రేక్షకుల కేరింతలతో హోరెత్తింది. మిస్‌ వరల్డ్‌ పోటీదారులు కూడా వారి కుర్చీల్లో నుంచి లేచి మరీ ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ వేయడం మరింత సందడి చేసింది. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. హైటెక్స్‌ ప్రాంగణం ప్రధాన ద్వారం నుంచి మొదలుకుని వేదిక వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడా చిన్న లోపం లేకుండా పర్యవేక్షించారు. సీఎం సహా పలు రంగాల ప్రముఖులు హాజరవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే పోటీలు ముగిసి సీఎం, సహా ప్రముఖులు వెళ్లిపోయిన తరువాత మిస్‌ వరల్డ్‌ పోటీదారుల దగ్గరకు వెళ్లేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఆ సమయంలో పోలీసులు కొద్దిసేపు అక్కడ లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. స్టేజీ దగ్గరకు పోలీసులు రావాలంటూ నిర్వాహకులు మైకులో ప్రకటించిన తరువాత అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే చాలామంది స్టేజీ పైకి వెళ్లడంతో వారిని పంపించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.


ఇవి కూడా చదవండి

జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..

Updated Date - Jun 01 , 2025 | 07:12 AM