Gulf Migration Issues: ఎడారి దేశంలో తడారిపోతున్న బతుకులు
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:56 AM
స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్ బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

ఎడారి దేశంలో తడారిపోతున్న బతుకులు
గల్ఫ్లో జిల్లా వాసుల ఇక్కట్లు
ఇటీవల ఒకే గ్రామం నుంచి దుబాయ్లో ఇద్దరి మృతి
సౌదీలో జిల్లా వాసి అవస్థలు
జీతం ఇవ్వమని అడిగితే వీసా టర్మినేట్ చేయించిన కంపెనీ
రెండు నెలలుగా రోడ్డుపైనే జీవనం
నిజామాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్ (Gulf) బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు సక్రమంగా లేకపోవడంతో ఎంతో మంది గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు.
జిల్లాకు చెందిన 3లక్షల మందికి పైగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు. సౌది అరేబియా, దుబాయ్, మస్కట్, ఓమన్, ఖతర్, షార్జా, ఇరాక్, ఇరాన్ లాంటి దేశాలలో ఉపాధి నిమిత్తం వెళ్లిన వారు ఏళ్లతరబడి అక్కడే పనిచేస్తున్నారు. వారిని చూసి మరికొంత మంది విజిట్ వీసాతో వెళ్లి అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల వేల్పూర్ మండలం పచ్చలనడ్కుకు చెందిన ఇద్దరు వ్యక్తులు నెల రోజుల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పోయారు. గ్రామానికి చెందిన సాబేర్ అలీ, కిషన్లు మూడు దశాబ్దాలుగా సౌదిలో ఉండగా నెల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రా మంలో విషాదం నింపింది. తాజాగా మా క్లూర్ మండలం అమ్రాద్ తండాకు చెందిన మెగావత్ సంతోష్ సౌదిఅరేబియాలో కంపెనీ చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతూ సోమవారం సెల్ఫీవీడియో విడుదల చేశాడు.
ఇండియాకు రప్పించాలని వేడుకోలు..
తనను ఇండియాకు రప్పించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతూ సౌది అరేబియా నుంచి మెగావత్ సంతోష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. మాక్లూర్ మండలం అమ్రాద్ తండాకు చెందిన మెగావత్ సంతోష్ 18 నెలల క్రితం సౌది అరేబియాకు వెళ్లాడు. అక్కడ బందర్ అల్దాబి కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కేవలం మూడు నెలల జీతం ఇచ్చిన కంపెనీ ఇంకా 15 నెలల జీతం ఇవ్వాలని అక్కడి లేబర్ కోర్టులో కేసు వేయగా కంపెనీ అతనిపై డీజిల్ చోరీ చేసి పరారైనట్లు అబియోగంమోపింది. దీంతో న్యాయస్థానం 16వేల రియాల్ జరిమానా విధించడంతో పాటు పదేళ్ల పాటు వీసా టర్మనేట్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
చేయని నేరానికి తప్పుడు ఆరోపణలతో శిక్ష పడిన సంతోష్ ఇండియాకు తిరిగి రాకుండా ట్రావెల్ బ్యాన్ వేయడంతో గత రెండు నెలలుగా రోడ్లపైనే జీవనం కొనసాగిస్తూ తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇక్కడ భార్య రాణి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయింది. పెద్ద కొడుకు విష్ణు హాస్టల్లో చదువుతుండగా చిన్న కొడుకు వర్ధన్ స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. తన భర్తను ఇండియాకు రప్పించాలని భార్య రాణి వేడుకుంటుంది. తమది పేద కుటుంబం అని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది.
ఇవి కూడా చదవండి..
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
44 ఏళ్ల కెరీర్లో నేను నేర్చుకున్నది ఇదే.. అనుభవాలను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
Read latest Telangana News And Telugu News