Miss World Contestants: చార్మినార్ చెంత.. అందాల పుంత
ABN , Publish Date - May 14 , 2025 | 01:44 AM
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్బజార్ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.

ప్రపంచ సుందరి పోటీదారుల హెరిటేజ్ వాక్
మినార్లను ప్రత్యక్షంగా తిలకించి తన్మయత్వం
నేడు ఓరుగల్లు పర్యటనకు సుందరీమణులు
హైదరాబాద్/సిటీ/చార్మినార్, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని అందమంతా ఒక్కచోటకు చేరింది.. ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ వద్ద సందడి చేసింది. మిస్ వరల్డ్ పోటీల కోసం పలు దేశాల నుంచి తరలివచ్చిన అందగత్తెలు మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. ఇక్కడి చారిత్మ్రక కట్టడాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను పరిశీలిస్తూ ఉత్సాహంతో ఉరకలేశారు. ఆయా దేశాల సంప్రదాయ దుస్తులను ధరించి చార్మినార్కు వచ్చిన ముద్దుగుమ్మలకు అరబిక్ సంప్రదాయ వాయిద్యాలు, మర్ఫా సంగీతంతో కళాకారులు స్వాగతం పలికారు. లయబద్ధంగా చేసిన మర్ఫా సంగీతానికి పలువురు సుందరీమణులు ఆనందోత్సాహంతో అభివాదం చేస్తూ స్టెప్పులేస్తూ ప్రత్యేక వేదికపైకి చేరుకున్నారు. వేదిక వద్ద తెలుగు సంప్రదాయం ప్రకారం పర్యాటక అధికరారుల బృందం వారికి స్వాగతం పలికింది. ఓవైపు మర్ఫా సంగీతం, మరోవైపు స్థానికుల కేరింతల మధ్య ముద్దుగుమ్మలు చేసిన సందడితో చార్మినార్ పరిసరాలు సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన 109 మంది అందగత్తెలు చార్మినార్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక మెట్ల వేదికపై వరుస క్రమంలో చేరుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫొటో షూట్కు హాజరయ్యారు. అనంతరం చార్మినార్లోకి ప్రవేశించి అద్భుత కట్టడాన్ని పరిశీలించారు. ఉత్తర-దక్షిణ భారత రాష్ట్రాల సంస్కృతి, సమ్మిళిత సంప్రదాయాలకు కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నగర వైభవ ప్రాభవాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ ఐకాన్గా నిలిచిన చార్మినార్ నిర్మాణంలోని సుందర లతామల్లికల కుడ్య చిత్రాలు, నగిషీలను చూసి ముగ్దులయ్యారు. సొగసైన కట్టడం నిర్మాణ శైలిని పరిశీలించి.. చారిత్మ్రక ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లాడ్బజార్ దుకాణాల సందర్శన
చార్మినార్ను పరిశీలించిన అనంతరం ప్రపంచ సుందరి పోటీదారులు లాడ్బజార్లోకి ప్రవేశించారు. అక్కడి వ్యాపారులు తమ దుకాణాల్లో ముత్యాలు, రత్నాలు పొదిగిన రంగురంగుల డిజైన్ల లక్కగాజులను అందంగా అలంకరించారు. ఈ దుకాణాలను సందర్శించిన సుందరీమణులు అక్కడ ప్రదర్శించిన లక్కగాజులు, మేలిమి ముత్యాల హారాలు, అలంకరణ వస్తు సామగ్రిని పరిశీలించారు. హైదరాబాద్ ప్రత్యేక డిజైన్ మట్టిగాజులు, పెళ్లి, పేరంటాళ్ల సందర్భంలో వినియోగించే ప్రత్యేక అలంకరణ వస్తు సామగ్రి వివరాలను, వాటిని ధరించే తీరును వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా డిజైన్ గాజులను కొనుగోలు చేసేందుకు సుందరీమణులు ఎంపిక చేసుకోగా.. వ్యాపారులు వారి వద్ద డబ్బు తీసుకోకుండా కానుకగా అందించారు. అక్కడే లక్కగాజుల తయారీ ప్రక్రియను ముద్దుగుమ్మలు పరిశీలించారు. హస్త కళాకారులతో చేయి కలిపి అభినందించారు. కాగా, చార్మినార్ వద్ద మిస్వరల్డ్ పోటీదారులతో ఏర్పాటు చేసిన హెరిటేజ్వాక్తో హైదరాబాద్ నగర సాంస్కృతిక వారసత్వం, వైభవ ప్రాభవ సౌందర్యాన్ని ప్రపంచానికి మరోసారి తెలియజేసినట్లయింది.
వామపక్ష మహిళా నేతల హౌస్ అరెస్టు
చార్మినార్ వద్ద ప్రపంచ సుందరి పోటీదారుల హెరిటేజ్ వాక్ నేపథ్యంలో మంగళవారం వామపక్ష ప్రజాసంఘాలకు చెందిన పలువురు మహిళా నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అందాల పోటీలను వామపక్ష విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. హిమాయత్నగర్లోని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, నగర కార్యదర్శి వరలక్ష్మిని గృహ నిర్బంధం చేశారు. రాంనగర్లోని మార్క్స్ భవనం, బాగ్లింగంపల్లి ఐద్వా కార్యాలయం, ఖైరతాబాద్లోని ఏఐఎంఎ్సఎస్ ఆఫీసుల వద్ద కూడా పోలీసులు పహారా కాశారని ప్రజాసంఘాల నేతలు తెలిపారు.
చేతికి గాజులు తొడుక్కుని.. మెడలో దండలు వేసుకుని..
లక్కగాజులకు పెట్టింది పేరుగా నిలిచే పాతబస్తీలోని లాడ్ బజార్ను మిస్వరల్డ్ పోటీదారులు సందర్శించారు. ఇరుకు గల్లీలో రెండు వైపులా ఉన్న గాజుల షాపులు, ముత్యాలహారాల దుకాణాలు, సంప్రదాయ పెళ్లి దుస్తులు, మెహిందీ కోన్లను కొనుగోలు చేసి సందడి చేశారు. ఆయా దుకాణాల్లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. అధికారులు ముందస్తుగా ఎంపిక చేసిన దుకాణాలకు వెళ్లిన ముద్దుగుమ్మలు.. వాటిలోని వస్తువులను తిలకించి పులకించారు. ప్రధానంగా లక్కగాజులు, మట్టిగాజులను చేతికి తొడుక్కుని సంతోష పడ్డారు. మరికొందరు ముత్యాల దండలను మెడలో వేసుకుని తన్మయత్వం పొందారు. మరికొందరు సంప్రదాయ దుస్తులు, దుపట్టా, లెహంగాలను కొనుగోలు చేశారు. తమ వద్ద ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో డెబిట్ కార్డుల ద్వారా గాజులు, ముత్యాల దండలను తీసుకున్నారు. కాగా, తమ దుకాణానికి వచ్చిన విదేశీ వనితలకు పలువురు నిర్వాహకులు బహుమతిగా చిన్నపాటి ముత్యాల దండలను ఇచ్చారు. అంతకుముందు పలువురు ఉస్మానియా బిస్కెట్లు తిని, ఇరానీ చాయ్ తాగారు. మిస్వరల్ట్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో లాడ్బజార్ రోడ్డును అందంగా తీర్చిదిద్దారు. నాలుగు రోజుల వరకు గతుకులుగా ఉన్న రోడ్డుపై బీటీ వేశారు. అలాగే మధ్యలో ఆకర్షణీయమైన వస్తువులను ఉంచారు.
పోలీసుల భారీ బందోబస్తు..
చార్మినార్, లాడ్బజార్లో మిస్వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ నలుదిక్కులైన గుల్జార్హౌస్, లాడ్ బజార్, సర్దార్ మహల్చౌరస్తా, చార్మినార్ బస్టాండ్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులు, సంద ర్శకులను కట్టడి చేశారు. చార్మినార్ ప్రాంగణంలోకి ఎక్కువ మందిని రాకుండా అడ్డుకున్నారు. కేవలం కొన్ని దుకాణాలకు మాత్రమే అనుమతించారు. కాగా, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చార్మినార్ ప్రాంగణంలో అప్పటికే ఉన్న సందర్శకులు, కొనుగోలుదారులను పోలీసులు బయటికి పంపించారు. మొత్తంగా మూడంచెల భద్రత చేపట్టారు. అందాలభామలు చార్మినార్ నుంచి వెళ్లిన తర్వాత సాయంత్రం 6.30 గంటల నుంచి సందర్శకులను అనుమతించారు.
నేడు ఓరుగల్లుకు సుందరీమణులు
వరంగల్: ప్రపంచ సుందరి పోటీదారులు బుధవారం ఓరుగల్లును సందర్శించనున్నారు. కాకతీయుల కఽళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. అందాలభామల రాక కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరంగల్ కోట, వెయ్యి స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.