Mallu Bhatti Vikramarka: కేసీఆర్ చేసిన తప్పులను మాపై రుద్దుతున్నారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:14 PM
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ఖమ్మం జిల్లా: తమ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసి కాపాడుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు అండగా నిలిచిందని నొక్కిచెప్పారు. ఇవాళ(సోమవారం,జులై14)న కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ (Paleru Reservoir) నుంచి సాగర్ నీటిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు పాలేరు రిజర్వాయర్ నుంచి 1500 క్యూసెక్కుల సాగు నీటిని రెండో జోనుకు మంత్రులు విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఇవాళ సాగర్ రెండో జోన్కు సాగునీరు విడుదల చేశామని తెలిపారు.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కరెంట్, ప్రాజెక్ట్లు అని అభివర్ణించారు. గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్, హరీష్రావు, కేటీఆర్ తప్పులు చేసి వాటిని ఇప్పుడు తమపై రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. రైతులు పండించిన పంటకు పెట్టుబడిగా రైతు భరోసా, రూ.9 వేల కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో సన్నవడ్లకు బోనస్ ఇచ్చామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం: మంత్రి పొంగులేటి
రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఉద్ఘాటించారు. 2,55,324 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. గత ఏడాది కనీవినీ ఎరుగని వరదల కారణంగా సాగర్ మెయిన్ కెనాల్ పూర్తిగా కొట్టుకుపోయిందని.. దానిని పునరుద్ధరించామని తెలిపారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు పూర్తి స్దాయిలో సాగునీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్లో వచ్చే నీటితో మొదటి పంటకు ఎలాంటి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుణ దేవుడి అండ ఉందని.. ఇది శుభసూచకమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేసినా.. తమ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడ్డామని నొక్కిచెప్పారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు అన్నదాతల ఖాతాలో వేశామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..
నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి
Read Latest Telangana News And Telugu News