Chamal Kiran Kumar: కేసీఆర్ ఓపెన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. చామల సూటి ప్రశ్న
ABN , Publish Date - Jun 11 , 2025 | 03:04 PM
Chamal Kiran Kumar: కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారని.. వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

న్యూఢిల్లీ, జూన్ 11: మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కాళేశ్వరం కమిషన్ విచారణపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పందించారు. ఇప్పటి వరకు విచారణకు వచ్చిన అందరూ కమిషన్ ముందు ఓపెన్ కోర్టులో సమాధానాలు చెప్పారని... కేసీఆర్ కమిషన్ ముందు ఎందుకు వన్ టు వన్ అడిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ప్రభుత్వానికి కుట్ర చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి 48 లక్షలు ఎకరాలకు నీళ్లు అందించినట్టు వారు చేబితే సమర్థించే వాళ్ళమన్నారు.
కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారని.. వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు చైనాలో కట్టి ఉంటే ఉన్నతమైన అవార్డు వచ్చేదని కేటీఆర్ అంటున్నారని.. చైనాలో ఇలాంటి ప్రాజెక్టు కేసీఆర్ కట్టి ఉంటే ఈరోజు ఆయన్ను ఉరి తీసేవారని వ్యాఖ్యలు చేశారు. రూ. 30 వేల కోట్లు అయ్యే ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. చైనాలో ఇలాంటి కమిటీ వేస్తే రెండు రోజుల్లో కేసీఆర్ను ఉరి వేసేవారన్నారు. కేసీఆర్కు ఏ దేశంలో అత్యున్నత అవార్డు ఇస్తారో చెప్పాలన్నారు.
ఐకేపీ సెంటర్లో గతంలో కంటే ఈసారి వడ్లు ఎక్కువగా కొనుగోలు చేశామన్నారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడు సన్న బియ్యం తినిపించలేదన్నారు. అధికారం కోల్పోయిన బాధ బీఆర్ఎస్ నేతల్లో ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘మీ ఇంట్లో మీ మీరు పంచాయతీలు పెట్టుకున్నట్టు డ్రామా’ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు, రాష్ట్రంలో సన్న బియ్యం, భూ భారతి వంటి బ్రహ్మాండమైన పథకాలు వచ్చాయన్నారు. ప్రజలను డైవర్షన్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లు పరిపాలించి కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని అన్నారు. నిజాం సాగర్, కడియం ప్రాజెక్ట్, లోయర్ మానేరు, సింగూర్ డ్యాం కాంగ్రెస్ హయాంలో కట్టాం ఎక్కడ కూలిపోలేదని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందన్నారు. కక్ష్య సాధింపుల కోసం ఈ కమిషన్ను తీసుకురాలేదన్నారు. కేసీఆర్కు అత్యున్నత పదవి కావాలని అనుకుంటే కమీషన్లకు కక్కుర్తి పడకుండా ఉండాల్సిందని హితవుపలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడం తప్ప కేటీఆర్ చేసింది ఏమీ లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
Read latest Telangana News And Telugu News