Hyderabad High Alert: భాగ్యనగరంలో హై అలర్ట్.. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విస్తృత సోదాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:57 AM
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 13: భాగ్యనగరంలో (Hyderabad) హైఅలర్ట్ కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో మెట్రో నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు , శంషాబాద్ ఎయిర్ పోర్టులలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిటీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోటల్స్పై పోలీసులు నిఘా పెంచారు.
ఇక.. దేశంలో ఎక్కడ, ఏ ప్రాంతంలో పేలుళ్లు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్లో ఉండటం తీవ్ర కలకలం రేపుతున్న విషయం. ఎన్ఐఏ, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు రాష్ట్రంలో తనిఖీలు చేయగా.. అనుమానిత వ్యక్తులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రాజేంద్రనగర్లో ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు.. పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా... రెండు రోజుల క్రితం ఢిల్లీలో భారీ పేలుడు ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట మెట్రోస్టేషన్ సిగ్నల్ వద్ద నిలిచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ బ్లాస్ట్తో దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
పెట్టుబడులతో ముందుకు రండి.. అంతా మాదే బాధ్యత: సీఎం చంద్రబాబు
ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్లో లోకేష్ ట్వీట్
Read Latest Telangana News And Telugu News