CM Chandrababu Naidu: పెట్టుబడులతో ముందుకు రండి.. అంతా మాదే బాధ్యత: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:23 AM
ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని.. మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. ఈరోజు (గురువారం) ఉదయం ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని తెలియజేశారు. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందన్నారు. గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని.. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని.. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని సమావేశంలో చెప్పారు. ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని... దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నామన్నారు. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలని... అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు.
స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని సీఎం అన్నారు. ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగిందని... సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో తాము బలంగా ఉన్నామని చెప్పారు. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశంలోని వివిధ నగరాల్ని అనుసంధానం చేస్తోందని సీఎం అన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోందని.. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చామని సమావేశంలో తెలిపారు.
ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని స్పష్టం చేశారు. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామన్నారు. ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందని తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని సీఎం అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి సాటి లేదన్నారు. వీటిని ఉపయోగించుకోవాలని యూరోప్ దేశాల్లోని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కోరారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుంది, అందులో ఏపీ ముందుంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్లో లోకేష్ ట్వీట్
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సు.. హాజరుకానున్న నారాయణ
Read Latest AP News And Telugu News