Share News

CBI Court Judgement: గాలికి ఏడేళ్ల జైలు

ABN , Publish Date - May 07 , 2025 | 03:06 AM

గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి అనర్హతలోకి వెళ్లే అవకాశం ఉంది.సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంతో సబిత న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.

CBI Court Judgement: గాలికి ఏడేళ్ల జైలు

  • ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్‌రెడ్డి దోషే

  • 14 ఏళ్ల విచారణ తర్వాత సీబీఐ న్యాయస్థానం తీర్పు

  • మరో ముగ్గురికి ఆయనతో పాటు ఏడేళ్ల కారాగారం

  • నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్‌ కృపానందం

  • తన ప్రజా సేవను గుర్తించి, తన వయస్సును పరిగణలోకి

  • తీసుకొని శిక్షను తగ్గించాలని జడ్జిని అభ్యర్థించిన గాలి

  • ఆరోపణలు రుజువయ్యాయి.. మీకు యావజ్జీవం ఎందుకు విధించవద్దు?.. అని ప్రశ్నించిన న్యాయమూర్తి

  • తీర్పు వెలువడగానే చంచల్‌గూడకు గాలి తరలింపు

  • జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం

  • ‘ఓబుళాపురం’తో అప్పట్లోనే ఖజానాకు 884 కోట్ల నష్టం

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల అక్రమ తవ్వకాల కేసులో మైనింగ్‌ మాఫియా డాన్‌, కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురికి కూడా ఏడేళ్ల కారాగార శిక్షను ఖరారు చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణానంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి టి.రఘురామ్‌ మంగళవారం తీర్పునిచ్చారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ 2007-09 మధ్యకాలంలో యధేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఐపీసీ 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409, 468, 471 (ఫోర్జరీ), అవినీతి నిరోధక యాక్ట్‌లోని సెక్షన్లు 13 (2), 13 (1)(డి) సెక్షన్ల కింద 2009లో కేసు నమోదైంది. కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రానికి లేఖ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. సరిహద్దులను కూడా మార్చేసి, నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అప్పట్లోనే రూ.884 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది.


మంగళవారం వెలువడిన తీర్పులో ఏ1 బి.వి.శ్రీనివాస్ రెడ్డి(గాలి బావమరిది), ఏ2 గాలి జనార్దన్‌రెడ్డి, ఏ3 అప్పటి గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, ఏ7 మెహఫుజ్‌ అలీ ఖాన్‌ (గాలి వ్యక్తిగత సహాయకుడు)లను దోషులుగా నిర్ధారించి, నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఎనిమిదవ నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కృపానందం, తొమ్మిదో నిందితురాలిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పటి గనుల మంత్రి, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసు విచారణ సమయంలో ఏ5 ఆర్‌.లింగారెడ్డి మృతి చెందారు. ఏ6గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ద్వారా 2022లో ఈ కేసు నుంచి విముక్తి పొందారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 219 మంది సాక్షులను విచారించారు. 3,336 పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. జనార్దన్‌రెడ్డిని సీబీఐ 2011 సెప్టెంబరు 5న అరెస్టు చేసింది. దాదాపు మూడున్నరేళ్లు జైల్లో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిలుతో బయటకు వచ్చారు. తీర్పు వెలువరించే క్రమంలో భాగంగా న్యాయస్థానం తొలుత కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ వెంటనే సబిత కోర్టు హాల్‌ నుంచి బయటకు వచ్చిన కుమారుడు కార్తీక్‌రెడ్డిని ఆలింగనం చేసుకొని తనని నిర్దోషిగా ప్రకటించిన విషయం చెప్పారు. ఆ తర్వాత న్యాయస్థానం నిందితుల వరుస క్రమంలో పిలుస్తూ, దోషులుగా ప్రకటిస్తూ శిక్షను ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డికి శిక్ష విధించడానికి ముందు కోర్టుకు ఏమైన చెప్పాలనుకుంటున్నారా? అని జడ్జి ప్రశ్నించారు. తనకు శిక్ష తగ్గించాలని గాలి ప్రాధేయపడ్డారు. మాజీ మంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సుదీర్ఘ కాలంగా సేవ చేస్తున్నానని, స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా పలు సామాజిక సహాయ కార్యక్రమాలను చేస్తున్నందున శిక్ష తగ్గించాలని కోరారు.


తాను చేస్తున్న ప్రజాసేవను గుర్తించి గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలోని గంగావతి, బళ్లారి నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని గాలి జనార్దన్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటికే సుమారు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినందున, తన వయసును కూడా దృష్టిలో పెట్టుకొని శిక్ష తగ్గించాలని కోరారు. ఈ కేసులో ఆరోపణలు రుజువైనందున మీకు యావజ్జీవ శిక్ష ఎందుకు విధించకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో గాలి మౌనం వహించారు. గాలికి శిక్ష ఖరారు కాగానే కోర్టు హాల్‌లోని అతడి కుమార్తె బ్రాహ్మణిరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. గాలితో సహా నలుగురు ముద్దాయిలను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

హైకోర్టుకు గాలి

సీబీఐ కోర్టు తీర్పును బుధవారం హైకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు గాలి జనార్దన్‌రెడ్డి తరఫున న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన గాలి కుమారుడు కిరీటిరెడ్డి వివాహం ఉండటంతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నామని న్యాయవాది జితేందర్‌రెడ్డి చెప్పారు. గాలి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని, బెయిల్‌ పిటిషన్లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తామని వెల్లడించారు.

గాలిపై అనర్హత వేటు

రెండేళ్లకు మించి గాలి జనార్దన్‌రెడ్డికి జైలుశిక్ష పడడంతో అతడి ఎమ్మెల్యే పదవికి గండం ఏర్పడింది. ఏడేళ్లు జైలు శిక్ష పడడంతో అతడిపై అనర్హత వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా కేసులో రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడుతుంది.

Updated Date - May 07 , 2025 | 06:21 AM