CM Revanth Reddy: ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే!
ABN , Publish Date - May 09 , 2025 | 02:44 AM
భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, దేశాన్ని దెబ్బకొట్టాలని చూసే వారికి, ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.

భారత్వైపు కన్నెతి చూస్తే.. బతికే అర్హత లేనట్లే
మా ఆడబిడ్డల నుదుటి సిందూరం తీసినవారికి
‘ఆపరేషన్ సిందూర్’తో సమాధానం చెబుతాం
జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ర్యాలీ: సీఎం రేవంత్
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, దేశాన్ని దెబ్బకొట్టాలని చూసే వారికి, ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించే విషయంలో భారత సైన్యానికి 4కోట్ల తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని తెలిపారు. గురువారం సాయంత్రం సచివాలయం నుంచి నెక్లె్సరోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను భుజానపెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకతీతంగా ప్రజలంతా ఏకమవుతారని తెలిపారు. దేశ ప్రజలు శాంతికాముకులన్నారు. మా ఆడబిడ్డల నుదుటి సిందూరం తుడిచేయాలనుకునే వారికి ఆపరేషన్ సిందూర్తో సమాధానం చెబుతామని హెచ్చరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి.. అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశ భద్రత విషయంలో జెండాలకు, అజెండాలకు అతీతంగా 140 కోట్ల మంది భారతీయులు ఒక్కటవుతారని చెప్పారు. ‘పాక్ పాలకులు, ఉగ్రవాదులు సహా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి దాడులు చేయాలనుకునే వారెవరికైనా ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మా దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవ్వరినీ వదలం. ఈ భూమ్మీద మీకు నూకలు చెల్లినట్లే. బతికే అర్హత కోల్పోయినట్లే’ అని రేవంత్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నా.. దేశ రక్షణ విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్గాంధీ చెప్పారని గుర్తుచేశారు. గాంఽధీజీ శాంతి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న భారతీయులు.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ, ప్రపంచదేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. మన ఆడబిడ్డల నుదుటి తిలకం తుడిచేసిన ఉగ్రమూకలకు ఆపరేషన్ సిందూర్ ద్వారా మన వీరజవాన్లు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ సంఘీభావ ర్యాలీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు, ఆర్మీ మాజీ అధికారులు, పోలీసులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎం.. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News