Share News

CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌ కాదు.. డీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:37 AM

బీఆర్‌ఎస్‌ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాజ్య సమితి (డీఆర్‌ఎస్‌) అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా.. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమికొట్టించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌ కాదు.. డీఆర్‌ఎస్‌

అప్పట్లో మాజీ ప్రధానమంత్రి (పీవీ నరసింహారావు)కి సెషన్స్‌ కోర్టు నోటీసు ఇస్తే కోర్టు ఎదుట ఆయన హాజరయ్యారు. నువ్వు అంతకంటే గొప్పవాడివా? గతంలో నన్ను జైలులో పెడితే తొడగొట్టి పడగొట్టా. ఆ కుర్చీలో కూర్చున్నా. పట్టుబట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నా.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • దయ్యాల రాజ్య సమితితో ప్రమాదం

  • కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమికొట్టించాలి

  • ఒక్క నోటీసుకే కేసీఆర్‌ ఆగమాగం.. నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా

  • మూసీ పునరుజ్జీవం చేసి తీరుతాం.. నన్ను పడగొట్టాలని చూస్తున్నారు

  • ప్రజలు పదేళ్లు అధికారం ఇవ్వాలి.. టీటీడీ తరహాలో వైటీడీఏ పాలకవర్గం

  • యాదగిరిగుట్టలో యూనివర్సిటీ, గొప్ప విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తాం

  • స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు: సీఎం రేవంత్‌

  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రూ.1051 కోట్ల పనులకు శ్రీకారం

యాదాద్రి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాజ్య సమితి (డీఆర్‌ఎస్‌) అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా.. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమికొట్టించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ దయ్యాలతో చాలా ప్రమాదమని, తరిమికొట్టేందుకు ప్రజలంతా తనకు అండగా నిలవాలని అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో చేపట్టనున్న తొమ్మిది శాఖలకు చెందిన రూ.1,051.45 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కార్యకర్తల నినాదాలు కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు వినపడాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో దయ్యాలు ఉన్నాయని సొంత బిడ్డ ఆరోపించినా కేసీఆర్‌ ఫాంహౌ్‌సకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ దయ్యాలు ఎవరో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ కమిషన్‌ ఒక్క నోటీసు ఇస్తేనే కేసీఆర్‌ ఆగమాగం అవుతున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ‘‘అప్పట్లో మాజీ ప్రధానమంత్రి (పీవీ నరసింహారావు)కి సెషన్స్‌ కోర్టు నోటీసు ఇస్తే కోర్టు ముందు హాజరయ్యారు. అంతకంటే గొప్పవాడివా నువ్వు? గతంలో నన్ను జైలులో పెడితే తొడగొట్టి పడగొట్టా. ఆ కుర్చీలో కూర్చున్నా. పట్టుబట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నా’’ అని అన్నారు. బంగారు తెలంగాణ ముసుగులో బొందల తెలంగాణ చేసిపోయినోళ్లు మమ్మల్ని విమర్శిస్తారా? అని మండిపడ్డారు.


మూసీ పునరుజ్జీవం చేసి తీరుతాం..

కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు వెళ్లేందుకు రోడ్డుకోసం దత్తత గ్రామం వాసాలమర్రిని ఆగం చేశారని, ఇళ్లన్నీ కూలగొట్టి గ్రామస్తులను రోడ్డున పడేశారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. తాను అలా వదిలేయనని, వాసాలమర్రి వాసుల ఇక్కట్లు తీరుస్తానని ప్రకటించారు. తన పుట్టినరోజు నాడు మూసీ ప్రక్షాళనపై పాదయాత్ర నిర్వహించి, ఈ ప్రాంతవాసుల బాధలు గమనించానని తెలిపారు. ఆరు నూరైనా.. అడ్డం పడినా తొక్కుకుంటూ వెళ్లి మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత బిడ్డలు మూసీ విషంతో విషమ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనా? అని నిలదీశారు. మూసీ ప్రక్షాళన చేపట్టి.. మూసీని గోదావరి జలాలతో నింపుతామని అన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ, డిండి, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, తదితర సాగునీటి కాలువలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. గంధమల్లకు నీరు ఎక్కడి నుంచి ఇస్తారంటూ హరీశ్‌రావు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, నిధులు ఇచ్చినవారు నీరు ఇవ్వలేరా? అని వ్యాఖ్యానించారు.


యాదగిరిగుట్టలో వర్సిటీ, విద్యాసంస్థలు..

యాదగిరిగుట్ట దేవస్థానానికి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌ అన్నారు. త్వరలో వైటీడీఏ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా విద్యాసంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని, ప్రఖ్యాత యూనివర్సిటీని, గొప్ప విద్యాసంస్థలను నెలకొల్పుతామని, గోశాలలు, భక్తులకు సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. టీటీడీ తరహాలోనే వైటీడీఏ కూడా మున్ముందు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారమవుతాయని హర్షం వ్యక్తం చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ వాళ్లు మాత్రం విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీన జీతాలివ్వలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం 5 లక్షల మంది ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని అన్నారు. ఎందరో త్యాగధనులు, ఉద్యమకారులు పుట్టిన చైతన్యవంతమైన ప్రాంతంగా నల్లగొండ జిల్లాకు పేరుందన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నుంచి అభినందనలు అందుకోవడమంటే మామూలు విషయం కాదని సీఎం వ్యాఖ్యానించారు. ఎస్సీ కులాల వర్గీకరణ చేసినప్పుడు నరసింహులు తనను అభినందించారన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యను కూడా నరసింహులు లాగే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సీఎం పర్యటనలో పాల్గొన్నారు. కాగా, మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం నిర్ణయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజానీకం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్‌ సభా వేదిక నుంచి ప్రకటించారు.

10.jpg


పదేళ్లు అధికారం ఇవ్వాలి

తనను పడగొట్టాలని చూస్తున్నారని, ప్రజలు తనకు పదేళ్లు అధికారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఇతర దేశాలతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతానన్నారు. తనకు ప్రత్యేకంగా కోరికలేమీ లేవని, రాష్ట్రాన్ని న్యూయార్క్‌, టోక్యో మాదిరిగా అభివృద్ధి చేస్తానని, లక్ష బిలియన్‌ డాలర్ల ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. గత పాలకులు యాదగిరిగుట్ట ఆలయ పనుల్లో కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు మెక్కారని రేవంత్‌ ఆరోపించారు. యాదగిరిగుట్టను అపవిత్రం చేసినందుకు తగిన శిక్ష పడిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రోజే ఆయన బాత్రూమ్‌లో కిందపడి కాలు విరిగింది వాస్తవం కాదా? అని అన్నారు. గత ప్రభుత్వం యాదగిరిగుట్టను యాదాద్రిగా మారిస్తే తాము వచ్చాక యాదగిరిగుట్టగా మార్చామని తెలిపారు. 60 కిలోల బంగారంతో స్వామివారి విమాన గోపురాన్ని స్వర్ణమయం చేశామన్నారు. భక్తుల కోరిక మేరకు పాత సంప్రదాయాలను పునరుద్ధరించామని పేర్కొన్నారు.


రూ.1051.45 కోట్ల పనులకు శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకర్గంలో చేపట్టనున్న తొమ్మిది శాఖలకు చెందిన రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో శంకుస్థాపన చేశారు. రిమోట్‌ ద్వారా శిలాఫలకాలను ప్రారంభించారు. వీటిలో రూ.574 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ పనులు, రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం, యాదగిరిగుట్టలో రూ.183 కోట్లతో నూతన ప్రభుత్వ ఆస్పత్రి, కళాశాల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు రూ.54.70 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దనసరి సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు

బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 03:37 AM