CM Revanth Reddy: పోలవరం ముంపుపై ఐఐటీహెచ్తో అధ్యయనం
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:27 AM
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.

నెలలో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి
గోదావరి-బనకచర్ల అనుసంధానంపై
అభ్యంతరాలు ఏపీ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలి
కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలి
అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఐఐటీ హైదరాబాద్తో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించారు. శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్తో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం బ్యాక్వాటర్తో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని, అంతేకాకుండా భద్రాచలం ఆలయంతోపాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్పై ప్రభావం పడే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయించాలన్నారు. 1986లో గోదావరికి 27 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. భద్రాచలం వద్ద 76.5 అడుగుల ఎత్తుతో నది ప్రవహించిందని, అదే 2022 ఆగస్టులో 24.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 71 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 2022లో వచ్చిన వరదతో ఏకంగా 106 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 16 వేల ఇళ్లు నీట మునిగాయని వివరించారు. 1986లో వచ్చిన వరద కన్నా 2022 ఆగస్టు వరద తక్కువే ఉన్నప్పటికీ ముంపు తీవ్రత అధికంగా ఉందని గుర్తు చేశారు. దాంతో సమగ్ర అధ్యయనం కోసం ఐఐటీ హైదరాబాద్తో సర్వే చేసి, ఒక అభిప్రాయానికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధానాన్ని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని, దీనికి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. అనుమతుల కోసం ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిందని చెప్పారు. దీంతో ఈ విషయంలో అభ్యంతరాలు ఏమున్నా ఏపీ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే.. వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు: సీఎం రేవంత్
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సర్కారీ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. కాగా, యాదగిరిగుట్టలో వచ్చే నెల 19 నుంచి 23 వరకు నిర్వహించే సుదర్శన దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఆహ్వానం అందజేశారు. కాగా, అజ్మీర్ దర్గాకు ప్రభుత్వం తరఫున సీఎం చాదర్ సమర్పించారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, వక్ఫ్బోర్డు ఛైర్మన్ అజ్మతుల్లా, ముస్లిం మత పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.