Politicians Clash: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
ABN , Publish Date - May 01 , 2025 | 06:13 AM
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం ఏమిటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎంపీ కూడా తీవ్రంగా స్పందించారు.

నా నియోజకవర్గంలో మీ జోక్యమేంటి?
కాంగ్రెస్ ఎంపీని ప్రశ్నించిన ఎమ్మెల్యే
నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు?
ఎమ్మెల్యేకు అంతే స్థాయిలో ఎంపీ జవాబు
మంత్రి సమక్షంలో తీవ్ర వాగ్వాదం
మహబూబ్నగర్ , ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఒకరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎంపీ. మరొకరు ఆ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే. కాగా, ఇటీవల ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు, ఓ మంత్రి సమక్షంలోనే వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆవేశంతో ఊగిపోయినట్లు పేర్కొంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పది రోజుల క్రితం.. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు సంబంధిత మంత్రి ఆ నియోజకవర్గ కేంద్రానికి వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఆ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయిన అభ్యర్థితోపాటు.. ఆ వర్గం వారికి సదరు ఎంపీ ప్రాధాన్యం ఇవ్వడం, వారిని మంత్రికి పరిచయం చేసే కార్యక్రమానికి హాజరు కావాలని సూచించడాన్ని ఆ ఎమ్మెల్యే నిశితంగా గమనించారు. అనంతరం మంత్రి వాహనంలోకి ఎమ్మెల్యే, ఎంపీతోపాటు ఏఐసీసీలో కీలక బాధ్యతలో ఉన్న ఓ నాయకుడు ఎక్కారు.
అయితే.. వాహనంలోకి ఎక్కిన వెంటనే ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు?’’ అంటూ ఎమ్మెల్యే తీవ్ర స్వరంతో ఎంపీని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఎంపీ కూడా అంతే స్వరంతో మాట్లాడుతూ, ‘‘నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఇది నా నియోజకవర్గం. నాకు ఓట్లు వేసి గెలిపించిన వారికి బరాబర్ మద్దతిస్తా. నువ్వేమైనా ఓటు వేశావా?’’ అంటూ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒక దశలో ఇద్దరూ తీవ్ర ఆవేశంతో ఊగిపోయారని సమాచారం మంత్రి సమక్షంలోనే ఇదంతా జరగడంతో ఆయన విస్తుపోయినట్లు, మధ్యలో కూర్చున్న ఏఐసీసీ నాయకుడు ఇద్దరినీ శాంతింపజేసినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనను అటు ఎమ్మెల్యేగానీ, ఇటు ఎంపీ గానీ బహిర్గతం చేయకపోయినా.. తమ అనుంగు అనుచరులతో విషయాన్ని పంచుకోవడంతో బయటకు పొక్కినట్లు తెలుస్తోంది.