DSP Parthasarathi: ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ ఇంట్లో మందుగుండు
ABN , Publish Date - May 14 , 2025 | 02:13 AM
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

21 లైవ్ రౌండ్లు.. 69 ఖాళీ కాట్రిడ్జ్లు
ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్, హయత్నగర్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఒక స్కానింగ్ సెంటర్ నుంచి రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ కే.పార్థసారథి ఇంట్లో అక్రమ మందుగుండును ఏసీబీ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పార్థసారథిని అరెస్టు చేసిన తర్వాత హయత్నగర్లోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో కొన్ని విలువైన డాక్యుమెంట్లతోపాటు 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్లు, ఒక కాట్రిడ్జ్ స్టాండ్ను గుర్తించారు. వీటి గురించి అధికారులు ప్రశ్నించగా ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పార్థసారథిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. లైవ్ రౌండ్లు అనధికారికంగా ఆయన ఎందుకు పెట్టుకున్నారనే విషయాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.