Anil Kumble: అతడిని ఆడిస్తారనుకున్నా: అనిల్ కుంబ్లే
ABN , Publish Date - Nov 16 , 2025 | 08:33 AM
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా ఈ విషయంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-సౌతాఫ్రికా మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే సాయి సుదర్శన్ను బెంచ్కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించడంపై ఇప్పటికే క్రికెట్ మాజీలు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా సాయి సుదర్శన్ను ఆడించకపోవడంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే(Anil Kumble) స్పందించాడు.
‘టీమిండియా బ్యాటింగ్ లైనప్ను చూసి నాకు ఆశ్చర్యం వేసింది. సాయి సుదర్శన్(Sai Sudarshan)ను కచ్చితంగా ఆడిస్తారనే అనుకున్నా. వన్ డౌన్ బ్యాటింగ్ ఎవరు? అనే దానికి సందిగ్ధత నెలకొంది. ఇంతలోనే ఆ స్థానంలో వాషింగ్టన్ సుందర్(Washington Sundar) నంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చాడు. బౌలింగ్లో నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగారు. నేను ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడిస్తారని అనుకున్నా. కానీ నా ఆలోచనకు విరుద్ధంగా జరిగింది’ అని కుంబ్లే వెల్లడించాడు.
అందుకే దక్కలేదు..
‘రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ను తుది జట్టులోకి తీసుకోవడం వల్లే సాయి సుదర్శన్కు చోటు దక్కలేదు. మరోవైపు తొలి రోజు పిచ్ బాగుంది. ఆ పిచ్పై నలుగురు స్పిన్నర్లు అవసరమే లేదు. కానీ అలాంటి పిచ్పై గిల్ ఎలాంటి వ్యూహాలు వేసి స్పిన్నర్లను వాడుకుంటాడానేది ఆసక్తికరంగా అనిపించింది. తొలి రోజు ఇద్దరు బౌలర్లు ప్రభావం చూపుతారనేదే నా అభిప్రాయం’ అని ఆయన వివరించాడు.
అందరూ ఆల్రౌండర్లే..
‘ఎక్కువ మంది ఆల్రౌండర్లు జట్టులో ఉండటం వల్లే సాయి సుదర్శన్కు చోటు దక్కలేదు. ఇక్కడ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ ఏం ఆలోచిస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాదు. టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్ తప్పించి అందరూ ఆల్రౌండర్లే. పంత్ను కూడా ఆల్రౌండర్గానే భావిస్తా. జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్... జట్టు మొత్తం ఆల్రౌండర్లతో నిండింది. ఇదే జట్టుతో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఆడుతోంది’ అని కుంబ్లే వివరించాడు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి