Ind Vs SA: సౌతాఫ్రికాతో వన్డేలకు వాళ్లకు రెస్ట్!
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:40 AM
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు స్టార్ పేసర్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరం కానున్నట్లు సమాచారం.
గాయం కారణంగా..
సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్ టీ20 ఫైనల్కు ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నందున ఒకేసారి 50 ఓవర్ల మ్యాచ్లు ఆడటం రిస్క్ అవుతుంది. అందుకే టీ20 ప్రపంచ కప్ వరకు ఈ ఫార్మాట్పైనే దృష్టి సారించాలని హార్దిక్కు బీసీసీఐ(BCCI) మెడికల్ టీమ్ సూచించినట్లు సమాచారం.
వర్క్ లోడ్..
ఫాస్ట్ బౌలర్ల వర్క్ లోడ్ నిర్వహించే ప్రణాళికలో భాగంగా బుమ్రా(Bumrah)కు కూడా సౌతాఫ్రికా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు టీ20 ప్రపంచ కప్ 2026 సన్నాహకాలలో అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి సౌతాఫ్రికా వన్డే సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత, హార్దిక్ పాండ్యా ముందుగా బరోడా తరఫున సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్తో జరగబోయే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్లలో పాల్గొంటాడు. 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ వరకు 50 ఓవర్ల క్రికెట్కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వచ్చే ఐపీఎల్ తర్వాతే సీనియర్ ఆటగాళ్లు 2027 వన్డే ప్రపంచ కప్ సైకిల్పై దృష్టి పెడతారు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి