Kohli-Rohit: కోహ్లీకి భారతరత్న! రోహిత్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ABN , Publish Date - May 18 , 2025 | 01:41 PM
భారత జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ కొద్ది రోజుల గ్యాప్లోనే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వైట్ జెర్సీలో వీళ్లను చూడలేమనే బాధ ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ఓ అవార్డుతో వీళ్ల అభిమానుల మధ్య ఫైట్ మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇద్దరూ 5 రోజుల వ్యవధిలో సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ జట్టు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోకో జోడీ లేని జట్టును ఊహించలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇద్దరూ కలసి ఆడిన ఇన్నింగ్స్లు, సాధించిన ఘనతల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇద్దరికీ ప్రభుత్వం నుంచి మరిన్ని పురస్కారాలు రావాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టిన కోహ్లీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇప్పుడు ఇదే రోకో ఫ్యాన్స్ మధ్య చిచ్చుకు కారణంగా మారింది.
ఇవ్వాల్సిందే..
రోహిత్-కోహ్లీ ఇద్దరూ భారత్కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించారు. క్లిష్టమైన మ్యాచుల్లో టీమ్ను లెక్కలేనన్ని సార్లు బయటపడేశారు. ఇద్దరూ కెప్టెన్గానూ ఫుల్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కోహ్లీకే భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సరికాదని.. రోహిత్కూ ఆ పురస్కారాన్ని ఇవ్వాలని అతడి ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి. సారథిగా టీ20 వరల్డ్ కప్-2024తో పాటు చాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్కు అందించాడని, అతడికి ఆ అవార్డు ఇవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అతడికేం తక్కువ?
రోహిత్-కోహ్లీకి ఇస్తే మరో దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీని కూడా భారతరత్నతో గౌరవించాలనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్-2007తో పాటు వన్డే ప్రపంచ కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013ను టీమిండియాకు అందించాడని, అతడి సేవల్ని ఎలా తక్కువ చేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత క్రికెట్కు అందించిన మహత్తర సేవలకు గానూ కోహ్లీని భారతరత్నతో గౌరవించాలని మాజీ బ్యాటర్ సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. కాగా, మన దేశంలో క్రీడల్లో ఒకే ఒక వ్యక్తికి భారతరత్న పురస్కారం దక్కింది. అదే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. రిటైర్మెంట్ తర్వాత 2014లో అతడ్ని ఈ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. మరి.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న అవార్డు గోల ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి