Virat Kohli-Digvesh Rathi: కోహ్లీతో మైండ్గేమ్స్.. ఇవే తగ్గించుకుంటే మంచిది!
ABN , Publish Date - May 28 , 2025 | 05:08 PM
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటే అన్ని జట్లు భయపడతాయి. తోపు ఆటగాళ్లు కూడా అతడి జోలికి వెళ్లాలంటే జంకుతారు. అలాంటిది ఓ కుర్ర బౌలర్ మాత్రం విరాట్ను రెచ్చగొట్టాడు. అసలేం జరిగిందంటే..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జోలికి వెళ్లాలంటే ఎవ్వరైనా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. బరిలోకి దిగితే అగ్రెసివ్గా మారే కింగ్.. తనను గానీ ఎవరైనా ఏమైనా అంటే వాళ్లను అస్సలు వదలడు. పరుగుల తుఫాన్ సృష్టించి అందులో ప్రత్యర్థులను ముంచేస్తాడు. మళ్లీ తన జోలికి రావాలంటే వణికేలా చేస్తాడు. అందుకే ఐపీఎల్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు విరాట్ను స్లెడ్జ్ చేసేందుకు అంతా భయపడతారు. ఎక్కడ జూలు విదిల్చి తమ మీదకు దూకుతాడో, వార్ వన్ సైడ్ చేస్తాడేమోనని జంకుతారు. అయితే క్యాష్ రిచ్ లీగ్లో ఓ కుర్ర స్పిన్నర్ కింగ్ను రెచ్చగొట్టాడు. మరి.. ఎవరా బౌలర్.. అతడికి విరాట్కు మధ్య ఏం జరిగింది.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
క్రీజు వరకు వెళ్లి..
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ ఈ ఐపీఎల్లో బాగా పాపులర్ అయ్యాడు. 13 మ్యాచుల్లో 14 వికెట్లతో అలరించిన ఈ బౌలర్.. తోపు బ్యాటర్లను కూడా తన స్పిన్ బలంతో భయపెట్టాడు. అయితే అతడి బౌలింగ్ కంటే కూడా వికెట్ తీశాక చేసుకునే నోట్బుక్ సెలబ్రేషన్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ కారణంగా అతడికి మూడుసార్లు జరిమానా విధించింది బీసీసీఐ. అయినా ఆర్సీబీతో మంగళవారం జరిగిన పోరులో కోహ్లీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు దిగ్వేష్. బెంగళూరు ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసేందుకు వచ్చిన స్పిన్నర్.. కోహ్లీతో మైండ్గేమ్ ఆడాడు. బంతి వేసేందుకు రనప్ మొదలుపెట్టిన దిగ్వేష్.. క్రీజు వరకు వెళ్లి యాక్షన్ పూర్తి చేయకుండా ఆగిపోయాడు. ఎందుకు బంతి వేయలేదన్నట్లు సీరియస్గా చూశాడు కోహ్లీ. దీంతో వెనుక వైపు చూపిస్తూ ఏదో కారణం చెప్పాడు దిగ్వేష్. దీంతో విరాట్తో పాటు వికెట్ల వెనుక ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ నవ్వుల్లో మునిగిపోయారు.
కోహ్లీతో ఆటలా..!
దిగ్వేష్ వ్యూహాన్ని పసిగట్టిన కోహ్లీ.. అతడు బంతి వేయకున్నా క్రీజులో కదలకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత అతడి వైపు గంభీరంగా చూశాడు. బంతి ఎందుకు వేయలేదో అతడు కారణం చెప్పాక నవ్వాడు. అనంతరం పంత్తో కాసేపు ముచ్చటించాడు. ఇదంతా చూసిన నెటిజన్స్.. ఈ సీజన్ మొత్తం బ్యాటర్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, నోట్బుక్ సెలబ్రేషన్స్ చేస్తూ అందర్నీ రెచ్చగొట్టాడని.. కానీ కోహ్లీ ముందు దిగ్వేష్ పప్పులు ఉడకలేదని అంటున్నారు. విరాట్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడని, కానీ ఇలాంటి టాక్టిక్స్ కోహ్లీ ముందు సాగవని చెబుతున్నారు. దిగ్వేష్.. ఇవి తగ్గించుకొని ఆట మీద దృష్టి పెట్టాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. టీమిండియాకు ఆడాలంటే పెర్ఫార్మెన్స్ ముఖ్యమని, కాంట్రవర్సీలతో ఒరిగేదేం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి