IPL 2025 Restart: ఐపీఎల్కు అండగా విదేశీ బోర్డులు.. ఈ రుణం తీర్చుకోలేనిది
ABN , Publish Date - May 15 , 2025 | 10:28 AM
BCCI: భారత క్రికెట్ బోర్డు క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025లోని మిగిలిన మ్యాచులను పూర్తి చేయడం బీసీసీఐకి సవాల్గా మారింది. అయితే దీన్ని అధిగమించడానికి విదేశీ బోర్డులు మనకు సాయం అందిస్తున్నాయి. ఈ విషయంలో భారత బోర్డు వాళ్లకు బాకీ పడిందనే చెప్పాలి.

క్రికెట్లోనే కాదు.. ప్రపంచంలోని అతిపెద్ద స్పోర్టింగ్ లీగ్స్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఐపీఎల్. ప్రతి ఏటా క్యాష్ రిచ్ లీగ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది భారత క్రికెట్ బోర్డు. అయితే ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 18వ సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో మే 17న లీగ్ను రీస్టార్ట్ చేస్తోంది బీసీసీఐ. అయితే సొంతూళ్లకు వెళ్లిపోయిన ఓవర్సీస్ ఆటగాళ్లు తిరిగిరావడం కష్టంగా మారడంతో లీగ్ కళ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ తరుణంలో తాము ఉన్నామంటూ బీసీసీఐకి అండగా నిలబడుతున్నాయి విదేశీ క్రికెట్ బోర్డులు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఫుల్ సపోర్ట్..
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెలలో జరగనుంది. దీంతో కప్ ఫైట్ కోసం ఎదురు చూస్తున్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. త్వరలో సన్నాహాలు మొదలుపెట్టనున్నారు. ఈ మ్యాచ్కు సిద్ధమవడంతో పాటు గాయాల భయం కూడా ఉండటంతో ఐపీఎల్ కోసం వాళ్లు తిరిగి భారత్కు వెళ్లడం అనుమానంగా మారింది. కానీ సౌతాఫ్రికా బోర్డు మాత్రం బీసీసీఐకి మద్దతుగా నిలిచింది. తమ ఆటగాళ్లను పంపేందుకు ప్రొటీస్ సిద్ధమైంది. అయితే మే 25న తమ ప్లేయర్లను తిరిగి స్వదేశానికి పంపాలని బీసీసీఐకి స్పష్టం చేసిందని సమాచారం.
గ్రీన్ సిగ్నల్
ఆస్ట్రేలియా బోర్డు కూడా ఐపీఎల్లో ఆడాలనుకునే తమ ఆటగాళ్లకు అడ్డురామని చెప్పినట్లు వినిపిస్తోంది. భారత్కు వెళ్లాలనుకుంటే తాము ఆపబోమని క్లారిటీ ఇచ్చిందట. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగొచ్చి ప్రాక్టీస్ సెషన్లో చేరాలని సూచించినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. అటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్లో ఆడాలనుకునే ప్లేయర్లను తాము ఆపబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని బోర్డులు ఆటగాళ్లకు పచ్చ జెండా ఊపడంతో చాలా మంది ఇండియా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ బోర్డులకు బీసీసీఐ బాకీ పడిందని నెటిజన్స్ అంటున్నారు. ఐపీఎల్ ప్రతిష్ట దిగజారకుండా కష్టకాలంలో తోడుగా నిలబడటం భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ రుణం తీర్చుకోలేనిదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బోర్డులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంజ్యురీలు, డబ్ల్యూటీసీ ఫైనల్, ఇతర దేశాలతో జరిగే సిరీస్లను దృష్టిలో పెట్టుకొని కొంతమంది కీలక ఆటగాళ్లు భారత్కు రావడం లేదు. అయితే వాళ్లనూ రప్పించేందుకు ఫ్రాంచైజీలు ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సమాచారం.
ఇవీ చదవండి:
నీరజ్ ఇక లెఫ్టినెంట్ కల్నల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి