Share News

Sri sathya Sai Medical Trust: పసి హృదయాలకు సంజీవని

ABN , Publish Date - May 24 , 2025 | 01:17 AM

ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.

Sri sathya Sai Medical Trust: పసి హృదయాలకు సంజీవని

ప్రాణాంతకమైన గుండె సమస్యతో పుట్టిన చిన్నారులకు, వారికి చికిత్సలు చేయించే ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లే తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసా ఇస్తోంది తెలంగాణలోని కొండపాక ‘ఆనందనిలయం’ ఆవరణలో ఉన్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి. అన్ని సేవలూ ఉచితంగా అందిస్తున్న ఈ ఆసుపత్రి ఇప్పటివరకూ 108 మంది పిల్లలకు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది.

క్షత్ర... తెలంగాణలోని నారాయణపేట జిల్లా కొల్లంపల్లికి చెందిన బలికి శివకుమార్‌ కుమార్తె. నక్షత్రకు గుండెకు రంధ్రం ఉన్నట్టు... ఆమె పుట్టిన 15 రోజులకే వైద్యులు నిర్ధారించారు. నాలుగేళ్ల వయసు వచ్చినా ఆమెలో ఎదుగుదల లేదు. పైగా త్రీవమైన ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేది. శస్త్రచికిత్స చేస్తే అన్నీ సర్దుకుంటాయని వైద్యులు చెప్పారు. దానికి కనీసం రూ. 5 లక్షలు కావాలి. ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాని గురించి కనీసం ఆలోచించలేని దుస్థితి ఆ కుటుంబానిది. కన్నబిడ్డ పడుతున్న నరకయాతన చూడలేక, శస్త్రచికిత్స చేయించే దారి లేక వేదనలో ఉన్న ఆ కుటుంబం ముందు కాంతిరేఖలా ఆవిష్కృతమయ్యింది... ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి. అక్కడ ఈ నెల 13న నక్షత్ర గుండెకు సర్జరీ జరిగింది. జీవితాంతం ఆమె గుండెకు ఎలాంటి ముప్పు రాకుండా... నిపుణులైన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు ఆ ఆసుపత్రిలోనే నక్షత్ర కోలుకుంటోంది. ఆమెకు మాత్రమే కాదు... 45 రోజుల వయసున్న పసికందుల నుంచి పదేళ్ల పిల్లల వరకూ... వారి గుండె సమస్యలకు ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి పరిష్కారం చూపుతోంది.

Untitled-3 copy.jpg


అన్నీ ఉచితమే...

దేశంలో ఏటా 2.48 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే గుండె సమస్యలకు గురవుతున్నారని అంచనా. వారిలో 60 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరం. కానీ 10 వేల మందికి మాత్రమే సర్జరీ చేసే అవకాశం ఉంది. గుండె సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులు సరైన చికిత్స లేక మృతిచెందుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం పలు ప్రాంతాల్లో ఛైల్డ్‌ హార్ట్‌కేర్‌ ఆసుపత్రులను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించాయి. హరియాణా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తరువాత... 4వ ‘శ్రీ సత్యసాయి సంజీవని హృదయ ఆసుపత్రి’ని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం శివారులోని ఆనంద నిలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. లక్షల రూపాయల విలువైన శస్త్రచికిత్సలను సైతం ఈ ఆసుపత్రిలో ఉచితంగానే చేస్తారు. వైద్యపరీక్షల్లో గుండె సమస్యలు బయటపడిన చిన్నారులెవరైనా ఇక్కడకు రావచ్చు. దేశంలో ఎక్కడివారికైనా ఇక్కడ సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. ప్రాంతాలతో సంబంధం లేదు. పైరవీలు, పలుకుబడిలతో పనిలేదు. ఎంతటి తీవ్రమైన గుండె సమస్యకైనా అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. పిల్లల వెంట వచ్చిన తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉచితంగా భోజన, వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. శస్త్రచికిత్స జరిగిన పిల్లలు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండేలా వసతులు కల్పించారు. మందులు కూడా పూర్తిగా ఉచితం. ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌, క్యాథ్‌ల్యాబ్‌, ఎకో పరికరాలతో ఓపీడీ భవనం, వంద పడకల భవనంతోపాటు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, సర్జికల్‌ టీమ్‌ ఉన్నాయి.


వారి కృషి ఎనలేనిది...

ఈ ఆసుపత్రిని ఆనంద నిలయం ఆవరణలో నిర్మించడం వెనుక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, టీటీడీ మాజీ ఈవో రమణాచారి ఎనలేని పాత్ర పోషించారు. ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘ఆనందనిలయం ట్రస్టు’కు చెందిన 100 ఎకరాల్లో ఒక చోట ఈ ఆసుపత్రిని నిర్మించాలని, ఈ ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తే తెలుగు రాష్ర్టాల్లోని చిన్నారులకు ప్రయోజనం కలుగుతుందని యోచించారు. అనుకున్నదే తడవుగా 5 ఎకరాలు కేటాయించారు. పరిశోధన కేంద్రం కోసం మరో 5 ఎకరాలు ఇచ్చారు. దీనికి అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కూడా సహకరించారు. ఈ సదుద్దేశానికి మద్దతుగా ‘ఆనందనిలయం ట్రస్టు’ సభ్యులు సైతం ముందుకొచ్చారు. దాంతో ఆసుపత్రి నిర్మాణాన్ని ‘శ్రీ సత్యసాయి సంజీవని ట్రస్టు’ చైర్మన్‌ శ్రీనివాస్‌, సభ్యులు తక్షణమే చేపట్టారు. అద్భుతంగా భవనాలు నిర్మించారు. అత్యాధునిక వైద్య పరికరాలను తెప్పించారు. పిల్లల గుండెలకు జీవం పోసే సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. 2024 నవంబర్‌లో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. ఆ నెలలో 28 మందికి, ఫిబ్రవరిలో 32 మందికి, మార్చిలో 23 మందికి, ఆ తరువాత 25 మందికి... మొత్తం ఇప్పటివరకూ 108 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు.

- పైడిపల్లి అరుణ్‌, సిద్దిపేట

ఫొటోలు: బాబు


ఇదొక దేవాలయం

మా అబ్బాయి జగదీశ్‌ప్రసాద్‌కు పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్‌లలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చూపిస్తే ఆపరేషన్‌ చేయించాలన్నారు. అందుకు రూ.3 నుంచి 5 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉండగా... ఇక్కడ ఆస్పత్రి ఉందని తెలిసి వచ్చాం. వెంటనే అడ్మిట్‌ చేసుకొని ఉచితంగా సర్జరీ చేశారు. మా బాబుతోపాటు మాకు కూడా వసతి, భోజనం కల్పిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. అందుకే ఇది కేవలం ఆసుపత్రి కాదు, ఇదొక దేవాలయం.

- సుజాత, భీమ్లాతండా, సూర్యాపేటజిల్లా

మూడో బిడ్డను దక్కించుకోగలిగాం

గతంలో మా ఇద్దరు పిల్లలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మూడో అబ్బాయి జహంగీర్‌కు ఇప్పుడు మూడు సంవత్సరాలు. పుట్టిన కొద్దిరోజులకే తనకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తేలింది. ఆపరేషన్‌ చేయించాలంటేనే భయం వేసింది. ఒకరోజు సినీనటుడు సుమన్‌కు తాత్కాలికంగా కారు డ్రైవర్‌గా వెళ్లాను. ఆ సమయంలో సుమన్‌ ఈ ఆసుపత్రి వారితో ఫోన్లో మాట్లాడడం గమనించి, నా మా అబ్బాయి సమస్య గురించి చెప్పాను. వెంటనే ఆయన ఆసుపత్రి నిర్వాహకుడు జగన్నాథశర్మతో మాట్లాడారు. మా అబ్బాయిని తీసుకువెళ్లగానే... సర్జరీ చేసి బ్రతికించారు. సుమన్‌కు, శ్రీసత్యసాయి సంజీవని వైద్యులకు కృతజ్ఞతలు.

- షరీఫ్‌, చాంద్రాయణగుట్ట


మానవసేవే మాధవసేవ

సత్యసాయిబాబా ఆశయాలను ఆచరిస్తూ పసి హృదయాలకు చికిత్సలు అందించే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఒక బృందంగా ఏకాగ్రతతో పని చేస్తున్నారు. హరియాణాలోని పల్వల్‌, ఛత్తీ్‌సగడ్‌లోని రాయ్‌పూర్‌, ముంబయి లాంటి నగరాల్లోనే ఇప్పటివరకు ‘సంజీవని హార్ట్‌కేర్‌ ఆస్పత్రుల’ను ఏర్పాటు చేశాం. మొదటిసారిగా గ్రామీణ ప్రాంత పిల్లల కోసం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆనందనిలయాన్ని ఎంచుకున్నాం. దాన్ని అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దాం. ‘మానవసేవనే మాధవసేవ’ అని సత్యసాయి అందించిన స్ఫూర్తితో సేవలు అందిస్తున్నాం.

- శ్రీనివాస్‌, చైర్మన్‌,

శ్రీ సత్యసాయి హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు

Updated Date - May 24 , 2025 | 01:20 AM