Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటులో చర్చ.. శశి థరూర్ ఎందుకు దూరం?
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:59 PM
ఈరోజు పార్లమెంట్కి చేరుకున్న శశి థరూర్ను ఆపరేషన్ సిందూర్ గురించి స్పందించమంటూ ఒక మీడియా ప్రతినిధి ప్రయత్నించాడు. కానీ మీడియా అడిగిన ప్రశ్నను ఆయన సమాధానం ఇవ్వకుండా నిశబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

భారత పార్లమెంట్లో ఈ రోజు ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక చర్చ మొదలైంది. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) పాల్గొనమని పార్టీ కోరినప్పటికీ, ఆయన తిరస్కరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేసింది.
కాంగ్రెస్ తరపున
ఈ చర్చలో రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ వాద్రా, దీపేందర్ హుడా, పరిణీతి షిండే, షఫీ పరంబిల్, మాణిక్యం ఠాగూర్, రాజా బరద్లు కాంగ్రెస్ తరపున పాల్గొన్నారు. ఈ జాబితాలో షశి థరూర్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అమెరికాకు వెళ్లిన అత్యంత ముఖ్యమైన ప్రతినిధి బృందాన్ని థరూర్ నడిపించారు. అయినప్పటికీ, ఆయన ఈ చర్చ నుంచి తప్పుకోవడం అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
జర్నలిస్ట్ ఒకరు
ఈ క్రమంలోనే ఈరోజు పార్లమెంట్కు చేరుకున్న థరూర్ను ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడతారా అని ఓ మీడియా ప్రయత్నించగా, ఆయన మీడియా అడిగిన ఈ ప్రశ్నను తప్పించుకుని వెళ్లిపోయారు. థరూర్ మాత్రం ఈ అంశంపై మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. మీడియా ఎదురుగా నిలబడ్డా, ప్రశ్నను తేలికగా తప్పించుకుని ముందుకు కొనసాగారు.
చివరి నిమిషానికి
అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రెణుకా చౌదరి చివరి నిమిషానికి సభకు చేరుకుని థరూర్తో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ, ఆయన ఎక్కడైనా మాట్లాడే హక్కును కల్గి ఉన్నారు. కానీ నేను అనుమతి ఇవ్వలేను కదా అని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అంటున్నాయి. ఆయన పార్లమెంటు చర్చలో పాల్గొనకపోయినప్పటికీ, పార్టీకి పూర్తి మద్దతుతో ఉన్నారని చెబుతున్నారు. థరూర్ గైర్హాజరీపై ఏవైనా విభేదాలు ఉన్నాయనే కోణాన్ని సైతం తోసిపుచ్చాయి.
ఎందుకు దూరం..?
ఇదంతా చూస్తుంటే థరూర్ నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలా? లేక పార్టీతో కొంత అసంతృప్తి ఉందా? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే రాజకీయంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారినప్పటికీ, అధికారికంగా మాత్రం థరూర్ గురించి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈ దూరం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి