JD Vance: తాజ్మహల్ ముందు జేడీ వాన్స్ ఫ్యామిలీ.. ఫొటోలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్..
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:38 PM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి తాజ్మహల్ వద్ద ఆహ్లాదంగా గడిపారు. పర్యటన అనంతరం ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలపై టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు..

భారత్ పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించిన విషయం తెలిసిందే. వాన్స్ ఫ్యామిలీకి ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో తాజ్ మహల్ అందాలను వీక్షించి, ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను వాన్స్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో షేర్ చేస్తూ.. తాజ్మహల్ను ఒక అందమైన చారిత్రాత్మక ప్రదేశంగా అభివర్ణించారు. అయితే ఈ ఫొటోలపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నుంచి స్పందన వచ్చింది..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (US Vice President J.D. Vance) తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి తాజ్మహల్ వద్ద ఆహ్లాదంగా గడిపారు. పర్యటన అనంతరం ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ఈ రోజు ఉష, పిల్లలతో కలిసి తాజ్మహల్ (Taj Mahal) సందర్శించాను. ఇది ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. అక్కడ మాకు లభించిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు’’ అంటూ వాన్స్ తన సంతోషాన్ని తెలియజేశారు. అయితే ఈ పోస్టుపై టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ‘‘ప్రపంచంలోని అత్యంత అందమైన అద్భుతాల్లో ఇది ఒకటి’’.. అంటూ బదులిచ్చారు.
జేడీ వాన్స్ కుటుంబం ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్మహల్ వరకూ కారులో వెళ్లారు. వీరి కాన్వాయ్ వెళ్లే మార్గంలో వందలాది పిల్లలు నిలబడి అమెరికా, భారత్ జాతీయ పతాకాలను ఎగురువేస్తూ స్వాగతం పలికారు. సుమారు గంటపాటు తాజ్మహల్ను వీక్షించిన వాన్స్ కుటుంబం.. అక్కడి అందమైన ప్రదేశాల్లో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా తాజ్మహల్లోని విజిటర్స్ డైరీలో జేడీ వాన్స్ తన అభిప్రాయాన్ని రాశారు. తాజ్మహల్ను అద్భుతం అంటూ అభివర్ణించిన ఆయన.. ‘‘నిజమైన ప్రేమకు, మానవ మేధస్సుకు ఇది ఓ నిదర్శనం’’.. అంటూ కొనియాడారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.