Pune Wedding: దటీజ్ ఇండియా.. హిందూ జంట కోసం మండపం షేర్ చేసిన ముస్లిం ఫ్యామిలీ..
ABN , Publish Date - May 23 , 2025 | 05:37 PM
Hindu Muslim Wedding In Pune: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం అని పదే పదే చెప్పడం వినే ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. వర్షం కారణంగా ఆగిపోయిన హిందూ జంట వివాహం కోసం పెళ్లి మండపాన్ని పంచుకునేందుకు ముందుకొచ్చింది ఓ ముస్లిం కుటుంబం.

Muslims Shared Wedding Hall For Hindu: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఆకస్మిక వర్షం కారణంగా ఒక హిందూ జంట వివాహం ఆగిపోయింది. ఆ పరిస్థితిలో ఎక్కడికెళ్లాలో పాలుపోక సందిగ్ధంలో పడిన పెళ్లివారికి ఓ ముస్లిం కుటుంబం సాయంమందించింది. మండపాన్ని షేర్ చేసి తమ ఇంట్లో పెళ్లిలా దగ్గరుండి వధూవరుల పెళ్లి జరిపించింది. ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంటలు వివాహం చేసుకున్న ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందూ ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ముస్లిం కుటుంబం సహకరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కదా.. సమతాభావమంటే అంటూ మెచ్చుకుంటున్నారంతా.
భారీ వర్షాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. అలాగే మంగళవారం పూణేలోని వాన్వాడీ ప్రాంతంలో ఓ హిందూ జంట పెళ్లి ఆగిపోయింది. సాంస్కృతిక కవాడే పాటిల్, నరేంద్ర గలాండే పాటిల్ సాయంత్రం 6.56 గంటలకు అలంకార్ లాన్స్లో వివాహం చేసుకోవలసి ఉండగా.. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఆరుబయట ఏర్పాటు చేసిన వేదిక పూర్తిగా తడిసి ముద్దయింది. అదే సమయంలో, పక్కనే ఉన్న బ్లాంకెట్ హాల్లో ముస్లిం జంట మహీన్, మొహ్సిన్ కాజీ రిసెప్షన్ (Walima) జరుగుతోంది. దీంతో హిందూ వధూవరుల కుటుంబసభ్యుల అక్కడకు వెళ్లి సప్తపది కోసం మండపం ఇవ్వమని ముస్లిం ఫ్యామిలీని అభ్యర్థించారు.
హిందూ జంట వివాహం తమ మండపంలో జరిపించేందుకు ముస్లిం కుటుంబం సమ్మతించడమే కాదు. అప్పటికప్పుడు వేదిక ఖాళీ చేసింది. హిందూ జంట వివాహం కోసం మండపం రెడీ చేసేందుకు ముస్లిం జంట రిసెప్షన్ కోసం వచ్చిన అతిథులూ తలో చెయ్యి వేసి సాయమందించారు. ఆ తర్వాత ఇరు మతాల వారు హిందూ జంట వివాహ వేడుకను జరిపించారు. విందును కూడా ఇరువైపులా వారూ కలిసి ఆస్వాదించారు. కొత్త జంటలు ఇద్దరినీ ఒకే స్టేజీ పైకి తీసుకొచ్చి ఫొటోలు తీసుకుంటూ సందడిగా గడిపారు.
సమాజంలో కులాలు, మతాల పేరుతో ఒకరినొకరు దూషించుకుంటూ ఉండేవారు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటి సమయంలో ఐక్యత, సోదరభావంతో పరస్పరం సహకరించుకుని మతతత్వం కంటే మానవత్వం ఎంత గొప్పదో చాటి చెప్పేందుకు ఇదే నిదర్శనం. కులం, వివక్ష పేరుతో ద్వేషించుకోకుండా ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సంఘటన మనకు బోధిస్తుంది.
ఇవీ చదవండి:
మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా..విమర్శలు
నేడు ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్..ఆర్సీబీ ఓడితే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి